హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ శాఖలో అవకతవకలపై అసెంబ్లీలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చేలా తమ ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేస్తున్నది. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పూర్తి అవగాహన కల్పించేందుకు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఒకరోజు ట్రైనింగ్ ఇవ్వనుంది. ఆదివారం సాయంత్రం ప్రజా భవన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో సమగ్రంగా వివరించనున్నారు.
కేఆర్ఎంబీ గురించి కూడా పూర్తిగా అవగాహన కల్పించనున్నారు. కేఆర్ఎంబీ పరిధి, కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను ఎమ్మెల్యేలకు ఇప్పటికే వివరించారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఇరిగేషన్ పై మరోసారి వైట్పేపర్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీఆర్ఎస్ నేతల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి గట్టిగా సమాధానం చెప్పేందుకు ఎమ్మెల్యేలను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు నిర్ణయించినట్లు తెలిసింది.