
న్యూఢిల్లీ : జీ20 సమిట్కు వచ్చే వివిధ దేశాల అధినేతలు, వారి ప్రతినిధుల బృందాలకు స్వాగతం పలికేందుకు చాందినీ చౌక్ వ్యాపారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో 100 మంది మహిళా ట్రాన్స్లేటర్లను ఏర్పాటు చేశారు. అతిథులతో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్తో పాటు ఇతర భాషలు మాట్లాడే మహిళల సేవలు ఉపయోగించుకుంటున్నారు. చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) మహిళా ట్రాన్స్లేటర్లను ఏర్పాటు చేసింది.
మహిళా పారిశ్రామికవేత్తలు, ఫ్యాషన్ డిజైనర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, బ్లాగర్లు, సెలూన్, బోటిక్ ఓనర్స్తో ఒప్పందం సీటీఐ కుదుర్చుకుంది. ఈ మహిళా ట్రాన్స్లేటర్లు 8, 9, 10 తేదీల్లో విదేశీ సందర్శకులకు, చాందినీ చౌక్ వ్యాపారులకు ట్రాన్స్లేటర్లుగా ఉంటారు. చాందినీ చౌక్కు సంబంధించిన వాలంటీర్ల లిస్ట్ను కూడా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సీటీఐ పంపించింది. ఫుడ్, షాపింగ్ కు చాందినీ చౌక్కు ఎంతో పేరుంది. అదేవిధంగా, చారిత్రాత్మక స్మారక చిహ్నాలకు దగ్గర్లో ఉండటంతో విదేశీ ప్రతినిధులు, పర్యాటకులను ఇట్టే ఆకర్శిస్తుంటుంది. ప్రపంచమంతా చాందినీ చౌక్ గురించి మాట్లాడేలా ఏర్పాట్లు చేసినట్లు షాప్ ఓనర్లు చెప్పారు.