బస్సుల్లేక అరిగోస.. సిటీలో పెరిగిన ప్రయాణ కష్టాలు
హైదరాబాద్ : కాళీమందిర్ వెళ్లనీకి సావిత్రమ్మ (64) లంగర్హౌజ్లో బస్సెక్కింది. కాలుపెట్టనీకి కూడా సందులేదు. జనాలను తోసుకుంటూ వెళ్లి నిల్చుంది. కొంచెం దూరం పోంగనే టెంపరరీ కండక్టర్ టికెట్ అంటూ వచ్చాడు. తన దగ్గరున్న జనరల్ పాస్ చూపిస్తే.. ‘‘లె..లె.. పైసలియ్యాలె. పాస్ నడ్వదు’’ అని చెప్పిండు. తన దగ్గర పైసల్లేవని చెప్పినా వినిపించుకోకుండా అక్కడనే నిర్ధాక్షిణ్యంగా దింపిండు.
‘నువ్వెవడవ్.. పైసలిచ్చినా టికెట్ ఇయ్యవా..? అడుక్క తిననీకి వచ్చినవా.. కష్టం చేస్తేనే పైసలొస్తున్నయ్.. మర్యాదగా టికెట్ ఇయ్యి.’ అని ఆరాంఘర్ వెళ్లేందుకు బస్సెక్కిన ఓ ప్రయాణికుడు కండక్టర్తో లొల్లికి దిగిండు. తన స్టేజీ నుంచి రూ.9 చార్జి ఉంటే రూ.18 ఎట్లా ఇస్తానని గొడవ పెట్టుకున్నడు. వీళ్లందరికీ టికెట్ ఇయ్యలే.. ఎవ్వలూ అడుగుత లేరు. నీకే ఇయ్యాల్నా’ అని ప్రైవేట్ కండక్టర్ అనడంతో లొల్లి మరింత ముదిరింది.
సిటీలో జనరల్ పాస్ తీసుకుని బస్సుల్లో జర్నీ చేస్తున్న పేద, మిడిల్ క్లాస్కి చెందిన వేలాది మంది సఫర్ అవుతున్నరు. ‘పాసులు చెల్లయ్’ అని చెప్తుండడంతో రోజూ పైసలు పెట్టలేకపోతున్నరు. నెలవారీ బడ్జెట్పై టికెట్ ఖర్చులు అదనపు భారంగా మారినయ్. ‘బస్పాస్కి డబ్బులు చెల్లించాం.. మళ్లీ పైసలెందుకు ఇయ్యాలె’ అని అడిగినా.. తాత్కాలిక సిబ్బంది మెడపట్టి మరీ గెంటేసిన ఘటనలున్నయ్. పండుగ సెలవులు ముగిసి కాలేజీలు, స్కూళ్లు ఓపెన్ కావడంతో స్టూడెంట్స్ కూడా ఇబ్బందులకు గురవుతున్నరు. పాస్లు చెల్లకపోవడంతో అదనంగా డబ్బులు కట్టలేక కాలేజీ మానేసే పరిస్థితి వస్తోంది. పండుగకు ఊళ్లకు వెళ్లిన వాళ్లు తిరిగి సిటీకి వస్తుండడంతో సరిపోను బస్సుల్లేక ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. ఇంత జరుగుతున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కనిపించడం లేదు.

