
- పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్
జహీరాబాద్, వెలుగు: పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలంటూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు (బి) గ్రామ శివారులోని ట్రెడెంట్ షుగర్ ఫ్యాక్టరీ వద్ద సోమవారం కార్మికులు ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీలోని మెషినరీని తరలించేందుకు యాజమాన్యం యత్నించగా... విషయం తెలుసుకున్న కార్మికులు అడ్డుకున్నారు. తమకు కోట్లాది రూపాయల జీతాలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని చెల్లించిన తర్వాతే మెషినరీని తరలించాలని డిమాండ్ చేశారు.
ఫ్యాక్టరీ ముందు బైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండేండ్లుగా వేతనాలు చెల్లించలేదని, బకాయిలను పూర్తిగా చెల్లించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. యాజమాన్యం స్పందించకపోతే తమ కుటుంబాలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
అనంతరం జహీరాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై కాశీనాథ్ ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని మెషినరీ తరలించేందుకు వచ్చిన భారీ క్రేన్, కంటెయినర్లను స్టేషన్కు తరలించారు. కార్మికులతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలని యాజమాన్యానికి సూచించారు.