హైదరాబాద్ : హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. సిగ్నల్ వద్ద భారీ వృక్షం ఒక్కసారిగా కూలింది. అదే సమయంలో సిగ్నల్ దగ్గర నిలుచున్న ఆటోపై కూలడంతో ఆటో డ్రైవర్ స్పాట్ లో చనిపోయాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు, ఒక్కసారిగా తమ వాహనాలు వదిలి పారిపోయారు.
సోమజిగూడ ఎమ్ ఎస్ మక్త ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ గౌస్ పాషా హిమాయత్ నగర్ నుండి బషీర్ బాగ్ వైపు వెళ్తున్నాడు. హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎదురుగా ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో ఆటోను ఆపాడు. ఫుట్ పాత్ పై ఉన్న భారీ వృక్షం కూలి నేరుగా ఆటోపై పడింది. దీంతో ఆటోలో ఉన్న డ్రైవర్ మహమ్మద్ గౌస్ పాషా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ వీడియో సీసీటీవీలో రికార్డ్ అయ్యింది.
ఘటన స్థలానికి చేరుకున్న జిహెచ్ఎంసి, డిఆర్ఎఫ్ సిబ్బంది భారీ వృక్షాన్ని తొలిగించారు. కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.