రెవెన్యూ ఉద్యోగులందరికీ మే నెలకు పూర్తి జీతం ఇవ్వాలని తెలంగాణ రెవిన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ ( ట్రెసా) ప్రెసిడెంట్ వంగ రవీందర్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరోనా, లాక్ డౌన్ నేపథ్యం లో గత రెండు నెలలుగా ఉద్యోగులకు సగం జీతం ఇవ్వడం వల్ల రెవెన్యూ ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. మే మొదటి వారం నుండి ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పని చేస్తున్నాయని, ఏపీ లో కూడా మే నెలకు పూర్తి వేతనాలు చెల్లించాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో తమకు కూడా పూర్తి జీతం ఇవ్వాలని సూచించారు.అలాగే పవిత్ర రంజాన్ పండగను దృష్టిలో ఉంచుకొని ముస్లిం సోదరులకు అడ్వాన్స్ గా వేతనం చెల్లించాలని ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్ ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అలాగే గత ఆరు మాసాలకు పైగా పెండింగ్ లో ఉన్న వెయిటింగ్ లో ఉన్న 26 మంది తహశీల్దార్లకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. నాయబ్ తహశీల్దార్ ల నుండి తహశీల్దార్లకు పదోన్నతుల కొరకు డి.పి.సి. ని వెంటనే ఏర్పాటు చేయాలని, తహశీల్దార్ల నుండి డిప్యూటీ కలెక్టర్లకు సుమారు వందకు పైగా పోస్టులు ఖాళీ ఉన్నందున పదోన్నతులు చేపట్టాలని వారు కోరారు.