
- ఎస్టీ ఆఫీసర్లకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్ ఆదేశం
- కిచెన్, టాయిలెట్లు రోజూ క్లీన్ చేయించాలని సూచన
హైదరాబాద్, వెలుగు: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని అశ్రమ పాఠశాలలు, గురుకులాలు, ఏకలవ్య మోడల్ గురుకులాలు, హాస్టళ్లలో శుభ్రత, పోషకాహారం ఏర్పాటుపై గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. స్కూల్ క్లాస్ రూమ్స్, కిచెన్, డైనింగ్ హాళ్లు, టాయిలెట్లు, ఆర్వో ప్లాంట్లను ప్రతిరోజూ శుభ్రం చేయించాలని అధికారులకు స్పష్టం చేశారు. విద్యార్థులకు పోషకాహారం అందే విధంగా మెనూ రూపొందించాలని, అనారోగ్య సమస్యల నుంచి కాపాడేందుకు శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. డైట్ ఛార్ట్లో సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఫొటోలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంగళవారం ఆయన సెక్రటేరియెట్ నుంచి ఐటీడీఏ పీవోలు, డిప్యూటీ డైరెక్టర్లు, జిల్లా ట్రైబల్ అధికారులు, ఆర్సీవోలు, ప్రిన్సిపల్స్, హెడ్మాస్టర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా శరత్ మాట్లాడుతూ..గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న స్కూళ్లల్లో తరగతి గదులు, బాత్రూమ్లు, టాయిలెట్లు, తలుపులు, కిటికీలు, ఆర్వో ప్లాంట్ల రిపేర్లను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు పాఠశాలల్లోని సమస్యలపై చెక్లిస్ట్ తయారు చేసి ఉన్నతాధికారులకు పంపాలన్నారు. ఈ సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టు ఆఫీసర్ల ద్వారా రిపోర్ట్ సమర్పించాలని సూచించారు. హెడ్ ఆఫీస్ నుంచి స్పెషల్ ఆఫీసర్లు జిల్లాలకు వెళ్లి తనిఖీలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర స్కీములపై అవగాహన
పీఎం జన్మన్, డీఏజేజీయూఏ (దర్తీ అబా జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్) కార్యక్రమాల గురించి గిరిజన ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని అధికారులకు శరత్ స్పష్టం చేశారు. జూన్ 17 నుంచి జులై 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. గిరిజన గ్రామాలు, మండలాల్లో ఈ స్కీమ్ల గురించి ప్రజలకు వివరించాలని కోరారు.