కొత్తగూడ, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలకేంద్రం గాంధీనగర్లోని గిరిజన సంక్షేమ బాలికల గురుకులంలో వసతులు లేవని స్టూడెంట్లు గురువారం ఉదయం గేట్ బయట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ గురుకులంలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 800 మంది గర్ల్స్ చదువుతున్నామని, విద్యాసంవత్సరం ప్రారంభమై నెలన్నర అయినా అయినా మౌలిక వసతులు కల్పించలేదని, నీళ్లు లేక, టాయిలెట్లు పనిచేస్తవలేవని, ఒంటికి రెంటికి చెట్ల పొదల్లోకి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమని అడిగితే తలా రూ.10 ఇస్తే రిపేర్ చేయిస్తానని ప్రిన్సిపాల్ కల్పన నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాదని వాపోయారు. టాయిలెట్లు లేక పోవడంతో పీరియడ్స్ వచ్చినా బయటికి వెళ్లి మార్చుకుంటున్నామని కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ విషయాల గురించి బయటికి చెబితే ఇంటర్నల్ మార్కులు తగ్గిస్తామని ప్రిన్సిపాల్ బెదిరిస్తోందన్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రాజ్కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రూప్సింగ్ అక్కడికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. తమ సమస్యలను పరిష్కరిస్తే ఆందోళన విరమిస్తామని చెప్పడంతో మంత్రి సీతక్కతో ఫోన్లో మాట్లాడించారు. వెంటనే మీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో బాలికలు ఆందోళన విరమించారు. కాగా స్టూడెంట్ల ఆందోళనపై కలెక్టర్ స్నేహ శబరీష్ స్పందించారు. డీసీవో అశోక్ను సరెండర్, చేయగా.. . ప్రిన్సిపాల్ కల్పనకు షోకాజ్ ఇచ్చి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం.
