చెన్నై : అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ప్రజా ప్రతినిధులు నడిరోడ్డుపై రౌడీల్లా కొట్టుకోవటం ఇప్పుడు తమిళనాట సంచలనం సృష్టిస్తుంది. తిరుచ్చి జిల్లా పొన్మలైలో బస్టాండ్ షెల్టర్ నిర్మాణం చేపట్టాలంటూ ప్రజలు ఐదేళ్లుగా స్థానిక అన్నాడిఎంకె ఎంపీ కుమార్ను కోరుతున్నారు. అయితే ఆయన వద్ద నుండి స్పందన రాకపోవటంతో స్థానిక డీఎంకె ఎమ్మెల్యే అన్బిల్ మహేష్ తన నిధులతో బస్టాండ్ నిర్మించారు. ఆదివారం ఈ బస్టాండ్ భవనం ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు స్థానిక డీఎంకే కార్యకర్తలు హాజరయ్యారు.
ఈ సమాచారం తెలుసుకున్న ఎంపీ కుమార్ కార్యకర్తలతో కలిసి అక్కడికి చేరుకుని బస్టాండ్ షెల్టర్ ను ప్రారంభించటానికి వీలులేదని డీఎంకే వర్గీయులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు వర్గాల నడుమ ఘర్షణ తలెత్తింది. అన్నాడీఎంకే కార్యకర్తలు రెచ్చిపోయి షెల్టర్ ను కూల్చివేయడమే కాకుండా ..డీఎంకే వర్గీయులపై దాడులకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే ఎంపీ కుమార్, డీఎంకే జిల్లా కార్యదర్శి, ఇరువర్గాల కార్యకర్తలు రోడ్డుపైనే కొట్టుకున్నారు.
