ఉద్ధవ్ వర్గం ప్రతిపాదించిన కొత్త గుర్తులివే..

ఉద్ధవ్ వర్గం ప్రతిపాదించిన కొత్త గుర్తులివే..

ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయం శివసేన పార్టీ గుర్తు ‘విల్లు -బాణం’  చుట్టూ తిరుగుతోంది. నవంబర్ 3న జరగనున్న తూర్పు అంధేరి అసెంబ్లీ నియోజకవర్గ బైపోల్ లో ఆ గుర్తును శివసేన లోని ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండే వర్గాలు వినియోగించకుండా కేంద్ర ఎన్నికల సంఘం స్తంభింపజేసింది. రెండు వర్గాలు సోమవారం (అక్టోబరు 10) కల్లా మూడు పేర్లు, గుర్తులను సూచించాలని..  వాటి నుంచే చెరో దాన్ని కేటాయిస్తామని వెల్లడించింది. దీంతో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం  ‘శివసేన బాలాసాహెబ్ ఠాక్రే’ పేరును మొదటి చాయిస్ గా, ‘శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే’ పేరును రెండో చాయిస్ గా, ‘శివసేన ప్రబోధన్కార్ ఠాక్రే’ పేరును మూడో చాయిస్ గా పేర్కొన్నట్లు తెలిసింది. త్రిశూలం, ఉదయించే సూర్యుడు, కాగడాలలో ఒకదాన్ని బై పోల్ కోసం పార్టీ గుర్తుగా కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని  కోరినట్లు సమాచారం.  ఉద్ధవ్, ఏక్ నాథ్ షిండే వర్గాల నాయకులు ఇదే అంశంపై ఇవాళ మధ్యాహ్నం వేర్వేరుగా సమావేశమై చర్చించడం గమనార్హం. 

శివసేన ఎమ్మెల్యే మృతితో..

శివసేన ఎమ్మెల్యే రమేష్ లాత్కే ఆకస్మిక మృతితో తూర్పు అంధేరి అసెంబ్లీ నియోజకవర్గానికి బై పోల్ వచ్చింది. బై పోల్ కోసం ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన వర్గం నుంచి రమేష్ లాత్కే భార్య రుతుజ పోటీ చేస్తున్నారు. ఇక ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ ముర్జీ పటేల్ పేరును బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు. 

ఏక్ నాథ్ షిండే ఫిర్యాదుతో.. 

వాస్తవానికి పార్టీ గుర్తు అంశాన్ని తొలుత  శివసేన చీలికవర్గం సారథి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అక్టోబరు 4న కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. శివసేన పార్టీ గుర్తు తమదేనని.. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు లేని ఉద్ధవ్ ఠాక్రే వర్గం దాన్ని వినియోగించకుండా చూడాలని కోరారు. స్పందించిన ఈసీ.. శివసేనలోని రెండు వర్గాలు దీనిపై అక్టోబరు 7కల్లా  లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని సూచించింది.  ఈ వివరణలను పరిశీలించిన ఈసీ.. ప్రస్తుతానికి తూర్పు అంధేరి బై పోల్ కోసం శివసేన గుర్తు ‘విల్లు -బాణం’ ను శివసేనలోని ఏ వర్గం కూడా వినియోగించరాదని ఆదేశించింది. కొత్త గుర్తును, కొత్త పేరును ఎంపిక చేసుకొని పోటీ చేయాలని నిర్దేశించింది.