ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు

ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు

ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తులు విధ్వంసం సృష్టించారు. ఆయన ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఎమ్మెల్సీ కవితపై అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలకు చేశారంటూ రెచ్చిపోయారు. బంజారాహిల్స్ లోని అర్వింద్ నివాసంలోకి చొరబడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలు కిటికీల అద్దాలు పగులగొట్టారు. ఆయన ఇంటి ముందు దిష్టిబొమ్మ  దహనం చేశారు. ప్రస్తుతం ఎంపీ అర్వింద్ నిజామాబాద్లో ఉన్నారు.

సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధమున్న కవితకు బీజేపీలో చోటు లేదని అన్నారు. ఆమెను తీసుకొస్తామన్న వారిని కూడా ఉపేక్షించమని చెప్పారు. అలా తీసుకొచ్చే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను డిమాండ్ చేస్తానని అర్వింద్ చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీతో కవిత టచ్ లో ఉన్నారని ఆయన ఆరోపించారు.