ఎల్లారెడ్డిపేట, వెలుగు: టీవీ చూసేందుకు వెళ్లిన ముక్కుపచ్చలారని ఆరేండ్ల చిన్నారిపై ఓ టీఆర్ఎస్ లీడర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలానికి చెందిన గిరిజన దంపతులు ఆరేండ్ల పాపతో కలిసి ఉద్యోగరీత్యా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ గ్రామంలో టీఆర్ఎస్ లీడర్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు అయిన శంకర్ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. శంకర్ మండల స్థాయి లీడర్ కాగా, ఆయన భార్య ఆ ఊరి సర్పంచి. ఈ నెల 27న పాప తల్లిదండ్రులిద్దరూ డ్యూటీలకు వెళ్లారు. ఇంట్లో టీవీ లేకపోవడంతో చిన్నారి శంకర్ ఇంట్లో చూసేందుకు వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేనిది చూసి శంకర్ పాపపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గురువారం పాపకు బాగా జ్వరం వచ్చింది. నొప్పి అంటూ బాధపడుతుండటంతో తల్లి ఏం జరిగిందని ప్రశ్నించగా.. జరిగిన విషయం చెప్పింది. శంకర్ను నిలదీయగా.. ఎవరికైనా చెప్తే బాగుండదని బెదిరిస్తూ గొడవకు దిగాడు. పాప పేరెంట్స్శుక్రవారం ఎల్లారెడ్డి పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు.
పెద్ద ఎత్తున ఆందోళనలు
చిన్నారికి న్యాయం చేయాలంటూ ఎల్లారెడ్డిపేటలో గిరిజన నాయకులు, బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీల లీడర్లు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. రోడ్డుపై కూర్చొని సుమారు 3 గంటల పాటు ధర్నా చేయడంతో ఎక్కడి వెహికల్స్ అక్కడే నిలిచిపోయాయి. డీఎస్పీ అక్కడికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.