మంచిర్యాల, వెలుగు: నెన్నెలలోని 502 సర్వే నంబరులో విద్యుత్ సబ్స్టేషన్ను రెండెకరాల్లో ఏర్పాటు చేశారు. ఆర్అండ్బీ రోడ్డుకు సబ్స్టేషన్కు మధ్య నాలాను వాననీళ్లు పోయేందుకు వదిలేసి దాని అవతల ఫెన్సింగ్ వేశారు. ఇదిలా ఉండగా, నెన్నెలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు ఎండీ.ఇబ్రహీం, దుర్శెట్టి రవీందర్ అదే సర్వేనంబరులో నాలుగేళ్ల క్రితం చెరి పది గుంటల భూమిని కొనుగోలు చేశారు. కానీ వారు ఇంతవరకు పొజిషన్లో లేరు. ఇటీవల లాక్డౌన్ సమయంలో అదనుచూసి సబ్స్టేషన్ ముందున్న నాలాతో పాటు రోడ్డుకు అవతలివైపు ఉన్న ఒర్రెను మట్టితో పూడ్చివేశారు. మర్రిచెట్టు ఊడలను తొలగించి సుమారు పది గుంటల స్థలాన్ని చదునుచేసి ఆక్రమణకు పూనుకున్నారు. ఈ విషయాన్ని కొంతమంది కలెక్టర్ భారతి హోళికేరితో పాటు విద్యుత్ శాఖ హయ్యర్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సదరు వ్యక్తులు సబ్స్టేషన్ స్థలాన్ని ఆక్రమించుకున్నారని, నాలాలో పోసిన మట్టిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక ఏఈ మల్లేశ్ ఏప్రిల్ 21న ఎస్సైకి, తహసీల్దార్కు కంప్లైంట్ చేశారు. రెవెన్యూ ఆఫీసర్లు సర్వే చేసి సబ్స్టేషన్ స్థలంలో మట్టిపోసినట్లు ధ్రువీకరించారు.
ఆ మట్టిని తొలగించి నాలాను క్లియర్ చేయాలని సంబంధిత వ్యక్తులకు తహసీల్దార్ ఆదేశాలు జారీ చేశారు. సరైన డాక్యుమెంట్లతో కంప్లైట్ చేయాలని ఎస్సై సూచించడంతో ఏఈ మల్లేష్ పిటిషన్ను వెనక్కు తీసుకున్నారు. ఇదే అదనుగా సదరు నాయకులను కాపాడేందుకు నియోజకవర్గ స్థాయి కీలక నేత ఒకరు ఆఫీసర్లపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. వారిపై కేసు కాకుండా తొక్కిపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో విషయం హయ్యర్ ఆఫీసర్లకు తెలిసింది. వారి ఆదేశాలతో ఏఈ మల్లేశ్ తాజాగా శుక్రవారం సంబంధిత డాక్యుమెంట్లు జతచేసి పోలీసులకు కంప్లైట్ చేశారు. ఈ మేరకు ఎండీ.ఇబ్రహీం, దుర్శెట్టి రవీందర్లపై ఐపీసీ 427, 447 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు నెన్నెల ఎస్సై రమాకాంత్ తెలిపారు. సదరు నాయకులు లాక్డౌన్, వాల్టా రూల్స్ను బ్రేక్ చేసిననప్పటికీ ఆఫీసర్లు చూసీచూడనట్టు వదిలేయడం గమనార్హం.