
హైదరాబాద్: ప్రజల దృష్టి మళ్లించేందుకే టీఆర్ఎస్ నేతలు బంద్ చేశారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆకస్మాత్తుగా సీఎం కేసీఆర్ కు రైతులపై ఎందుకు ప్రేమ వచ్చిందో అర్ధం కావడం లేదని అన్నారు. మంగళవారం నాడు హైద్రాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్ చావు దెబ్బ తిన్నాడని, ప్రజల దృష్టిని మరల్చేందుకే రైతు సంఘాల బారత్ బంద్ కు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించిందని విమర్శించారు. రైతుల సమస్యలపై ప్రేమ ఉన్న ముఖ్యమంత్రి బయటకు ఎందుకు రాలేదని, ఫామ్ హౌస్ లోనో, ప్రగతి భవన్ కే ఎందుకు పరిమితమయ్యాడో చెప్పాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇంతకాలం పాటు కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు ఆందోళనలు చేయలేదో చెప్పాలన్నారు.