- టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
- గవర్నర్ ప్రజాదర్బార్ ప్రజాస్వామ్యానికి విరుద్ధం
హైదరాబాద్, వెలుగు:పదిహేను రాష్ట్రాలు సీఎం కేసీఆర్ కనుసన్నల్లో ఉన్నాయని, ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లుడే.. బీజేపీని గద్దె దించుడేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. శనివారం టీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్ దేశ్ కీ నేత అని, ఆయన జాతీయ పార్టీ పెట్టుడు ఖాయమన్నారు. ప్రజా సమస్యలన్నీ క్షేత్రస్థాయిలోనే పరిష్కారమైనపుడు ప్రగతి భవన్లో ప్రజాదర్బార్ అవసరమే లేదన్నారు. రాజ్భవన్ను రాజకీయ భవన్గా మార్చారని, ప్రజాస్వామ్య విరుద్ధంగా గవర్నర్ తమిళిసై ప్రజాదర్బార్ నిర్వహించారని విమర్శించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజాదర్బార్ పేరుతో పొలిటికల్ దర్బార్ నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రధాని మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను గవర్నర్ లుగా నియమించాలన్న సర్కారియా, పూంచ్ కమిషన్ ల గురించి మాట్లాడారని, ప్రధాని అయ్యాక అందుకు విరుద్ధంగా చేస్తున్నారన్నారు. తమిళిసై రాజకీయాలు చేయాలనుకుంటే బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ కావచ్చని లేదా రాజ్యసభకు వెళ్లొచ్చన్నారు. గవర్నర్కు ప్రొటోకాల్ కల్పించే విషయంలో ఎలాంటి వివాదం లేదన్నారు. ఎమ్మెల్సీ కవిత తన సొంత నిధులతో గుడి కట్టిస్తే.. హిందూత్వం ఇప్పుడు గుర్తొచ్చిందా? అని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కామెంట్ చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు.
......................................................