16MP సీట్లను గెలిపిస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతాం

16MP సీట్లను గెలిపిస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతాం

రాష్ట్రంలో TRS పార్టీ తరపున 16 MP  సీట్లను గెలిపిస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతామన్నారు నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత. ఇవాళ జగిత్యాల జిల్లాలోని సారంగపూర్ మండలం పెంబర్ల- కొనాపూర్ నుంచి ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ… ఈ ఐదేళ్ల  కాలంలో ఢిల్లీలో నా గొంతును వినిపించే ప్రయత్నం చేశానన్నారు. తెలంగాణ సమస్యలతో పాటు దేశ సమస్యలపై మాట్లాడానన్నారు. ఢిల్లీ మెడలు వంచి టీఆర్‌ఎస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్నిసాధించిందన్నారు. ఆ విధంగానే ప్రత్యేక హైకోర్టు కోసం పార్లమెంట్‌లో కొట్లాడామన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు చేసినట్టు కెమెరాలు ఉన్నప్పుడు అర్ధ గంట ఉద్యమం చేసే పార్టీ మాది కాదన్నారు. ఫోటోలు, కెమెరాలు ఉన్నా లేకున్నా.. తనతో పాటు సహచర టీఆర్‌ఎస్ ఎంపీలమంతా ఐదు రోజుల పాటు లోక్‌సభలో ప్లకార్డులు ప్రదర్శించి.. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలబడి హైకోర్టును సాధించామన్నారు కవిత.