TRS పార్టీ మొదటిసారి మరో రాష్ట్రంలోని ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది. త్వరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రకు చెందిన పలువురు రైతులు టీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ను అనుమతిని ఇవ్వాల్సిందిగా కోరారు. నాందేడ్ జిల్లాలోని 5 నియోజకవర్గాలైన డెగ్లూర్, నయ్ గావ్, బోకర్, హిమాయత్ నగర్, కిన్వట్ కు చెందిన పలువురు రైతులు తమ సమస్యలను సీఎం కేసీఆర్ కు తెలిపారు.
తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా అమలవుతున్నాయన్నారు రైతులు. తమ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పోరాటానికి మద్దతివ్వాలని సీఎం కేసీఆర్ను అభ్యర్థించారు. టీఆర్ఎస్ పార్టీ టికెట్లపై పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.
గతంలో నాందేడ్ జిల్లాలోని 6 నియోజకవర్గాలను తెలంగాణలో కలపాలని నేతలు ఉద్యమించారు. ఇప్పుడు అదే నినాదంతో అక్కడ నుండి TRS టికెట్ పై పోటీచేసేందుకు కొందరు రైతులు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.