బిల్లుకు మద్దతు..చర్చకు నో!

బిల్లుకు మద్దతు..చర్చకు నో!

హైదరాబాద్‌, వెలుగు: ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ పునర్వ్యస్థీకరణ బిల్లుపై టీఆర్‌ఎస్‌ మరోసారి చిత్రమైన వైఖరి ప్రదర్శించింది. రాజ్యసభలో బిల్లుకు టీఆర్‌ఎస్‌ సభ్యులు మద్దతు పలికినా చర్చలో మాత్రం పాల్గొనలేదు. ఆర్టికల్​ 370 రద్దు చాలా కీలకమైన పరిణామం కావడంతో సీఎం కేసీఆర్‌ ఉదయం నుంచే రాజ్యసభ వ్యవహారాలపై దృష్టి సారించారు. పార్టీ పార్లమెంటరీ పక్షనేత కె.కేశవరావుతో ఫోన్‌లో మాట్లాడి బిల్లుకు మద్దతు తెలపాలని సూచించారు. అంతకుముందే ప్రధాని మోడీ సీఎం కేసీఆర్​కు ఫోన్​ చేసి జమ్మూకాశ్మీర్‌ బిల్లుకు మద్దతివ్వాలని కోరడం విశేషం. రాజ్యసభలో టీఆర్‌ఎస్‌కు ఆరుగురు సభ్యులుండగా.. డి.శ్రీనివాస్​ కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. సోమవారం మిగతా సభ్యులతోపాటు ఆయన కూడా రాజ్యసభలో జమ్మూకాశ్మీర్‌ బిల్లుకు మద్దతు తెలిపారు. అయితే అంతకుముందు ఈ బిల్లుపై జరిగిన చర్చలో టీఆర్‌ఎస్‌ ఎంపీలెవరూ పాల్గొనలేదు. పార్టీ తరఫున అభిప్రాయాన్ని సభలో వ్యక్తం చేయలేదు.

ఇంతకుముందూ..

పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టిన పలు బిల్లుల విషయంలోనూ టీఆర్ఎస్​ ఒక్కో రకంగా స్పందించింది. త్రిపుల్‌ తలాక్​ బిల్లుపై ఓటింగ్‌కు వ్యూహాత్మకంగా గైర్హాజరైంది. తన మిత్రపక్షం ఎంఐఎం ఈ బిల్లును వ్యతిరేకిస్తుండటంతో టీఆర్‌ఎస్‌ పార్టీ కావాలనే బిల్లుకు దూరంగా ఉండి.. పరోక్షంగా కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్‌ చేసింది. అంతకుముందు ఆర్టీఐ చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ టీఆర్‌ఎస్‌ మద్దతు తెలిపింది. తాజాగా జమ్మూకాశ్మీర్​ బిల్లుపైనా సైలెంట్​గానే పని కానిచ్చేసింది. టీఆర్‌ఎస్‌ వైఖరి ఏమిటో చెప్పాలని పలువురు నేతలను కోరినా.. స్పందించేందుకు నిరాకరించడం విశేషం.