- ట్రిబుల్ రైడింగ్ చేస్తున్న కొడుకు పొటో తీశారని ఆగ్రహం
- అరెస్ట్ చేసిన పోలీసులు
మల్కాజిగిరి, వెలుగు: బైకుపై ముగ్గురు ప్రయాణిస్తున్నారని ఫొటో తీసినందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడికి పాల్పడ్డ ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. సీఐ మన్మోహన్యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న మహ్మద్ ముజాఫర్(27) గురువారం ఉదయం మౌలాలి కమాన్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. ఇదే సమయంలో మౌలాలి నుంచి జెడ్టీఎస్వైపు టీఎస్ 13 ఈకె 3892 నెంబరు గల బైకు మీద ట్రిపుల్రైడ్ చేస్తూ వెళుతున్న వారిని కానిస్టేబుల్ ఫొటో తీశాడు. అది చూసిన ఆ ముగ్గురు ట్రాఫిక్ కానిస్టేబుల్ వద్దకు వచ్చి బూతులు తిడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
15 నిమిషాల తరువాత మల్కాజిగిరి 138 డివిజన్ వార్డ్మెంబర్, జేఏసీ నాయకురాలు సయ్యద్ మహముదా బేగం భర్త, కొడుకుతో పాటు మరో ఇద్దరితో వచ్చింది. ‘నా కొడుకు బైక్ఫొటో తీస్తావా. నీకు ఎంత ధైర్యం’ అంటూ ట్రాఫిక్ కానిస్టేబుల్ ముజఫర్ను చెప్పుతో కొట్టింది. అలాగే కానిస్టేబుల్ వద్ద ఉన్న కెమెరాను లాక్కుంది. ఈ విషయాన్ని ముజాఫర్ అధికారులకు సమాచారం అందించాడు. ఆపై మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు టీఆర్ఎస్ నాయకురాలు, వార్డుమెంబర్ సయ్యద్ మహముదా బేగం, ఆమె భర్త సయ్యద్ గఫార్ హుసాని, కొడుకు సయ్యద్ సాదిక్ హుసాని(21), బంధువులు గౌస్(29), మాజిద్(34)లను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై 332, 382, 506 ఆర్/డబ్లూ 34 ఐపీసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.