ట్రంప్ సర్కార్ పై కంపెనీ దావా

ట్రంప్ సర్కార్ పై కంపెనీ దావా

మంచి ప్రతిభ ఉన్న తెలుగు టెకీకి హెచ్​1బీ వీసా ఇవ్వకపోవడం పట్ల అమెరికా ప్రభుత్వంపై ఓ ఐటీ కంపెనీ దావా వేసింది. ఎన్ని సార్లు అప్లై చేసినా ఎందుకు తిరస్కరిస్తున్నారంటూ మండిపడింది. ఇది పూర్తిగా నిరంకుశత్వమేనని, విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని పేర్కొంది. సిలికాన్​ వ్యాలీలోని ఎక్స్​టెరా అనే కంపెనీ ఈ లాసూట్​ వేసింది. అనిశెట్టి ప్రహర్ష్​ చంద్ర సాయి వెంకట్​ అనే 28 ఏళ్ల తెలుగు టెకీని బిజినెస్​ సిస్టమ్​ అనలిస్ట్​గా నియమించింది. అతడి హెచ్​1బీ వీసా కోసం కంపెనీ దరఖాస్తు చేసింది. కానీ, అతడు చేసే ఉద్యోగానికి వీసా ఇవ్వలేమని అమెరికా వలస విధాన విభాగం (యూఎస్​సీఐఎస్) తేల్చి చెప్పింది.

అది స్పెషాలిటీ ఆక్యుపేషన్​ కాదని చెప్పింది. దీంతో కంపెనీ కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్​ కోర్టును ఆశ్రయించింది. ప్రహర్ష్​ అర్హతలు హెచ్​1బీ నిబంధనల్లోని స్పెషాలిటీ ఆక్యుపేషన్​ కిందకే వస్తాయని కోర్టుకు తెలిపింది. కాగా, ప్రహార్ష్​ ఎలక్ట్రానిక్స్​ అండ్​ కమ్యూనికేషన్స్​ ఇంజనీరింగ్​ (ఈసీఈ)లో డిగ్రీ చేశాడు. డాలస్​లోని యూనివర్సిటీ ఆఫ్​ టెక్సాస్​లో ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ అండ్​ మేనేజ్​మెంట్​లో మాస్టర్స్​ ఆఫ్​ సైన్స్​  పట్టా పొందాడు. తన భార్య వీసాపై డిపెండెంట్​ స్టేటస్​ కింద హెచ్​4 వీసా మీద అమెరికాలో ఉంటున్నాడు.