
మంచి ప్రతిభ ఉన్న తెలుగు టెకీకి హెచ్1బీ వీసా ఇవ్వకపోవడం పట్ల అమెరికా ప్రభుత్వంపై ఓ ఐటీ కంపెనీ దావా వేసింది. ఎన్ని సార్లు అప్లై చేసినా ఎందుకు తిరస్కరిస్తున్నారంటూ మండిపడింది. ఇది పూర్తిగా నిరంకుశత్వమేనని, విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని పేర్కొంది. సిలికాన్ వ్యాలీలోని ఎక్స్టెరా అనే కంపెనీ ఈ లాసూట్ వేసింది. అనిశెట్టి ప్రహర్ష్ చంద్ర సాయి వెంకట్ అనే 28 ఏళ్ల తెలుగు టెకీని బిజినెస్ సిస్టమ్ అనలిస్ట్గా నియమించింది. అతడి హెచ్1బీ వీసా కోసం కంపెనీ దరఖాస్తు చేసింది. కానీ, అతడు చేసే ఉద్యోగానికి వీసా ఇవ్వలేమని అమెరికా వలస విధాన విభాగం (యూఎస్సీఐఎస్) తేల్చి చెప్పింది.
అది స్పెషాలిటీ ఆక్యుపేషన్ కాదని చెప్పింది. దీంతో కంపెనీ కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించింది. ప్రహర్ష్ అర్హతలు హెచ్1బీ నిబంధనల్లోని స్పెషాలిటీ ఆక్యుపేషన్ కిందకే వస్తాయని కోర్టుకు తెలిపింది. కాగా, ప్రహార్ష్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ (ఈసీఈ)లో డిగ్రీ చేశాడు. డాలస్లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ ఆఫ్ సైన్స్ పట్టా పొందాడు. తన భార్య వీసాపై డిపెండెంట్ స్టేటస్ కింద హెచ్4 వీసా మీద అమెరికాలో ఉంటున్నాడు.