
వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్ మధ్య న్యూక్లియర్ వార్ ముప్పును తప్పించానని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి కామెంట్ చేశారు. యుద్ధాన్ని ఎవరైనా బులెట్లతోనే ఆపుతారు కానీ, తాను మాత్రం ట్రేడ్ పేరు చెప్పి రెండు దేశాలను కంట్రోల్ చేశానని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య రాజీ కుదిర్చినందుకు తానెంతో గర్వపడుతున్నానని చెప్పారు. అణ్వాయుధ శక్తి కలిగిన రెండు దేశాలు యుద్ధం చేసుకుంటూ ఉంటే తామెలా వాణిజ్యం చేయగలుగుతామని భారత్, పాక్కు చెప్పి రెండు దేశాలను శాంతింపజేశానని అన్నారు. అమెరికా ప్రభుత్వ సలహాదారు బాధ్యతల నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్తో కలిసి శనివారం ఓవల్ ఆఫీస్లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు.
అమెరికా జోక్యంతోనే అణు యుద్ధం తప్పిందన్నారు. ‘‘భారత్, పాక్ మధ్య కొట్లాట అణు విపత్తుగా మారి ఉండేది. అందుకే నేను ఒక మాట చెప్పిన. ఒకరిపై మరొకరు కాల్పులు జరుపుకుంటూ, అణ్వాయుధాలు వేసుకుంటూ ఉండే దేశాలతో మేం వాణిజ్యం చేయలేమని అన్నా. అంతే, ఆ రెండు దేశాల నాయకులు అర్థం చేసుకున్నరు. వాళ్లు చాలా గొప్పవాళ్లు. నా మాట విని కాల్పుల విరమణకు అంగీకరించారు. యుద్ధం ఆపేశారు” అని ట్రంప్ అన్నారు.
భారత్, పాక్తోపాటు అమెరికా ప్రజలకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ‘‘మనం అందరికంటే బాగా పోరాడగలం. పోరాటం చేసే దేశాలను శాంతింపజేయగలం. ప్రపంచంలో అమెరికా నాయకత్వం, మిలటరీ సామర్థ్యాలకు ఇది నిదర్శనం’’ అని ట్రంప్ చెప్పారు. కాగా, భారత్ ఆపరేషన్ సిందూర్ ఆపేసినప్పటి నుంచి ఈ యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ పలుమార్లు కామెంట్ చేశారు. ప్రపంచ వేదికలపైనా ఇదే మాట చెప్పుకొచ్చారు.