హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ కూడా కాంగ్రెస్ నాయకులను కలవకూడదని నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు. ఆదివారం గాంధీభవన్ లో సమావేశమైన నేతలు దుబ్బాక ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో గవర్నర్ అపాయింట్మెంట్ దొరకలేదన్న విషయాన్ని కాంగ్రెస్ ఇన్చార్జ్ మాణికం ఠాగూర్ గుర్తు చేస్తూ.. ప్రజల చేత ఎన్నిక కాబడ్డ ప్రజా ప్రతినిధులు, ఎంపీ లు, ఎమ్యెల్యేలు, ముఖ్య నాయకులు కలుస్తామన్నా.. కరోనో పేరు చెప్పి అవకాశం ఇవ్వలేదన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రం గవర్నర్ అవకాశమిచ్చారని, దీన్ని బట్టి గవర్నర్, బీజేపీ, టిఆర్ఎస్ అంతా ఒక్కటే అనిపిస్తుందని అన్నారు. ఇలాంటి పరిస్థితులలో మనం ప్రజల పక్షాన మరింత కష్టపడి పని చేసి ప్రజా సమస్యలను పరిష్కరించే విదంగా ఉద్యమించాలన్నారు.
సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి హాత్రాస్ అత్యాచార ఘటనపై మాట్లాడుతూ.. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లో మూడు రోజులుగా ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడానికి వెళ్తుంటే పోలీసులు అక్రమంగా అరెస్టులు చేశారన్నారు. ఈ అంశాలపై సోమవారం దేశ వ్యాప్తంగా దీక్షలు ఉన్నాయన్నారు. తెలంగాణలో కూడా రాష్ట్ర స్థాయిలో, జిల్లాల్లో సాయంత్రం 4 గంటల నుంచి 5 వరకు మౌన దీక్షలు చేయాలని, సత్యాగ్రహ దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
మండలి ఎన్నికల సందర్బంగా ఓటర్ల నమోదు ప్రారంభం అయ్యిందన్న ఉత్తమ్..ప్రతి ఒక్క కార్యకర్త ఓటర్లు నమోదు లో క్రియాశీలకంగా పని చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ వ్యతిరేక బిల్లులపై సంతకాల సేకరణ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని అన్నారు.