తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ (TS EAMCET-2023) కు సంబంధించిన కీని అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ https://eamcet.tsche.ac.in/ నుంచి కీని డౌన్ లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 17వ తేదీ రాత్రి 8 గంటల వరకు తమకు తెలియజేయాలని అధికారులు సూచించారు. విద్యార్థులు రెస్పాన్స్ షీట్లను, మాస్టర్ క్వశ్చన్ పేపర్లను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణలో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన ఎంసెట్ పరీక్షను ఈ నెల 12, 13, 14 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించారు. విద్యార్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణ తర్వాత ఫైనల్ కీని విడుదల చేయనున్నారు.
హాజరు 94.11 శాతం..
ఈసారి ఎంసెట్ పరీక్షలకు మొత్తం 94.11 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఎంసెట్కు మొత్తం 3,20,683 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,01,789 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో తెలంగాణ నుంచి 2,48,279 మంది దరఖాస్తు చేసుకోగా 2,35,918 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక ఏపీ నుంచి 72,204 మంది దరఖాస్తు చేసుకోగా పరీక్షలకు 65,871 మంది హాజరయ్యారు. తెలంగాణ నుంచి 12,561 మంది విద్యార్థులు పరీక్షలకు రాయలేదు. ఇక ఏపీ నుంచి 6,333 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు.
మే చివరివారంలో ఫలితాలు..
మే 10 నుంచి 14 వరకు జరిగిన ఎంసెట్ పరీక్షల ఫలితాలను మే చివరివారంలో విడుదలచేయనున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు మే 26 నుంచి 30 తేదీల మధ్యన ఫలితాలను విడుదల చేయాలని జేఎన్టీయూ అధికారులు భావిస్తున్నారు. ఈ సారి ఎంసెట్లో ఇంటర్ వెయిటేజీ నిబంధనను ఎత్తివేయడంతో ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ, ఫైనల్ కీ విడుదల, నార్మలైజేషన్ ప్రక్రియ అనంతరం ఫలితాలను విడుదల చేస్తామని జేఎన్టీయూ అధికారులు వెల్లడించారు .