వరంగల్​ సైనిక్​ స్కూల్ కు జాగ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం

వరంగల్​ సైనిక్​ స్కూల్ కు జాగ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం
  • 2016 లో శాంక్షన్​ చేసిన కేంద్ర ప్రభుత్వం 
  • హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల ఎలుకుర్తి వద్ద ఏర్పాటుకు నిర్ణయం
  •  ప్రతిపాదిత జాగలో అక్రమార్కుల మట్టి దందా 
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్లతో మరోసారి తెరమీదకు అంశం

‘‘తెలంగాణలో సైనిక్​ స్కూల్​ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది.  వరంగల్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.  దీనికి  సంబంధించి త్వరలోనే ఎంవోయూ కుదుర్చుకోబోతున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నాను” 
-2017 జనవరి 17న తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో సీఎం కేసీఆర్​

హనుమకొండ, వెలుగు:  కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి శాంక్షన్​ చేసిన  సైనిక్​ స్కూల్​ ఏర్పాటు ప్రక్రియ ఏడేండ్లు దాటినా ముందుకు కదలడం లేదు.  స్కూల్​ ఏర్పాటుకు హనుమకొండ జిల్లా ధర్మసాగర్​ మండలం ఎలుకుర్తిలో అసైన్డ్​  ల్యాండ్​గుర్తించిన లీడర్లు ఆ తర్వాత అటువైపు తొంగి చూడడం లేదు. దీంతో సైనిక్​ స్కూల్​ కు పునాదులు ఎప్పుడు పడ్తయో తెలియని పరిస్థితి.  సైనిక్​ స్కూల్​ ఏర్పాటు కోసం లేఖలు రాస్తున్నా రాష్ట్రం స్పందించడం లేదని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మళ్లీ ఆ అంశం తెరమీదకు వచ్చింది. అయితే ఏండ్లు గడుస్తున్నా రాష్ట్రం స్థలం అప్పగించకపోవడం, అక్కడ ఎలాంటి పనులు మొదలుకాకపోవడంతో కొంతమంది అక్రమార్కులు ఆ ల్యాండ్​పై కన్నేశారు.  జేసీబీలు, టిప్పర్లతో అదే స్థలంలో మట్టి దందాకు తెరలేపారు. దీంతో సైనిక్​ స్కూల్​ ప్రపోజల్​ పెట్టిన స్థలం కాస్త బొందలగడ్డగా మారుతున్నది.

50 ఎకరాలు చూసిన్రు..

కేంద్ర ప్రభుత్వం 2016లో రాష్ట్రానికి సైనిక్​ స్కూల్​  శాంక్షన్​ చేసింది. భూసేకరణ, బిల్డింగ్ కన్​ స్ట్రక్షన్​, మౌలిక వసతుల కల్పనకు  రూ.100 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేయగా.. శాశ్వత ప్రాతిపదికన బిల్డింగ్ నిర్మాణానికి  స్థలం ఇవ్వాల్సిందిగా రాష్ట్రాన్ని కోరింది. ఈ మేరకు ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్​, అప్పటి డిప్యూటీ సీఎం, ప్రస్తుత ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కూడా వివిధ సందర్భాల్లో స్పష్టం చేశారు. ఆ తర్వాత ధర్మసాగర్​ మండలం ఎలుకుర్తిలో ఇందిరాగాంధీ హయాంలో పేద రైతులకు ఇచ్చిన సర్వే నెంబర్​ 160 లోని అసైన్డ్​ ల్యాండ్  పరిశీలించారు. ఆ సర్వే నెంబర్​ లో  మొత్తం 229 ఎకరాల భూమి ఉండగా.. అందులో సైనిక్​ స్కూల్​ కోసం 50 ఎకరాలు, హైదరాబాద్​ పబ్లిక్​ స్కూల్​ కోసం మరో 50 ఎకరాలు పరిశీలించి పెట్టారు. అక్కడి రైతులు అదే ల్యాండ్ ను నమ్ముకుని బతుకుతుండగా.. వారందరికీ పరిహారం ఇచ్చిన తర్వాతనే రెండు స్కూళ్లకు భూసేకరణ పూర్తి చేస్తామని హామీ  ఇచ్చారు.  ఈ మేరకు సైనిక్​ స్కూల్​ కు భూసేకరణకు  అప్పట్లోనే రూ.4 కోట్లకు పైగా ఫండ్స్​ శాంక్షన్​ చేశారు. కానీ ఏడేండ్లు దాటినా ఆ ప్రక్రియ ముందుకు మాత్రం కదలడం లేదు. అయితే అసైన్డ్​ ల్యాండ్​ను ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందనే ఉద్దేశంతో ఆఫీసర్లు ఆ సర్వే నెంబర్​ ను ప్రొహిబిటెడ్​ లిస్ట్​ లో పెట్టారు. దీంతో అక్కడి రైతులు ఇటు పట్టా పాస్​ బుక్కులు రాక.. అటు పరిహారం అందక రెండు రకాలుగా నష్టపోతున్నారు. 

జాగ ముచ్చటే ఎత్తుతలేరు..

సైనిక్​ స్కూల్ తో పాటే హైదరాబాద్​ పబ్లిక్​ స్కూల్(హెచ్​పీఎస్​) సొసైటీకి స్థలం ఇచ్చేందుకు గతంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సైనిక్​ స్కూల్​కు  ప్రపోజల్​​ పెట్టిన స్థలం పక్కనే అదే సర్వే నెంబర్​ లోని మరో 50 ఎకరాలు హెచ్​పీఎస్​కు ప్రతిపాదించగా..  సంబంధిత ల్యాండ్​ కేటాయిస్తూ రెండేండ్ల కిందట జీవో నెం.93 జారీ అయ్యింది. ఈ మేరకు స్థలాన్ని అప్పగిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు 2021అక్టోబర్​ 18న హైదరాబాద్​లోని మంత్రుల నివాసంలో హెచ్​పీఎస్​ సొసైటీ సభ్యులకు అంగీకార పత్రం  అందించారు. ఆ తర్వాత సంబంధిత రైతులకు ఎకరాకు రూ.8.60 లక్షల చొప్పున మొత్తం 50 ఎకరాల్లోని 56 మంది రైతులకు దాదాపు రూ.4.3కోట్లకుపైగా నిధులు రిలీజ్​ కాగా రైతులకు అందజేశారు. కానీ  ఒకేసారి తెరమీదకు వచ్చిన రెండు స్కూళ్లలో సైనిక్​ స్కూల్​ ఊసెత్తకపోవడంతో ఆ విషయం కాస్త మరుగున పడింది. దీంతోనే  కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి పలుమార్లు రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే సైనిక్​ స్కూల్​ కు అడుగులు పడడం లేదని చెప్పారు. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ టూర్​ నేపథ్యంలో ఆదివారం హరిత హోటల్​ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా చెప్పారు.  అయినా దీనిపై అధికార పార్టీ నేతలు ఎప్పుడూ స్పందించిన దాఖలాలు లేవు.

అదే జాగలో మట్టి దందా

ప్రభుత్వం సైనిక్​ స్కూల్​ కోసం పరిహారం ఇచ్చి, భూమి తీసుకుంటుందనే ఉద్దేశంతో అక్కడి రైతులు ఆ స్థలాన్ని ఖాళీగానే ఉంచుతున్నారు. ఏండ్లు గడుస్తున్నా పునాది పనులు కూడా స్టార్ట్​ కాకపోవడంతో కొందరు అక్రమార్కులు ఆ స్థలంలో మట్టి దందా చేస్తున్నారు. ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండానే రాత్రికి రాత్రి జేసీబీలు, టిప్పర్లతో అక్కడి మట్టి కొల్లగొడుతున్నారు. దీంతో సైనిక్​ స్కూల్​ కోసం ప్రతిపాదించిన స్థలం ఇప్పుడు బొందల గడ్డగా మారింది. ధర్మసాగర్​ మండల కేంద్రానికి కూతవేటు దూరంలోనే ఈ మట్టి దందా సాగుతుండగా..  మైనింగ్​, పోలీస్​, రెవెన్యూ ఆఫీసర్లు లైట్​ తీసుకోవడంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  ఇప్పటికైనా ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని సైనిక్​ స్కూల్​కు స్థలం అప్పగించడమే కాకుండా అక్కడ జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.