- టెట్ ఉంటదా.. ఉండదా?
- తెలంగాణలో ఇప్పటికి కేవలం రెండుసార్లే టెట్
- రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల మంది ఎదురు చూపు
జగిత్యాల, వెలుగు: టీచర్ల ట్రాన్స్ ఫర్లు, ప్రమోషన్ల తర్వాత రాష్ట్ర సర్కారు దాదాపు 15 నుంచి 20 వేల టీచర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. టీచర్ పోస్టులను భర్తీ చేయాలంటే ముందు టీచర్ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది. టెట్ క్వాలిఫై అయినవారికే టీచర్ జాబ్ ఎగ్జామ్రాసే అర్హత ఉంటుందని ఇటీవల జాతీయ ఉపాధ్యాయ మండలి (ఎన్సీటీఈ) సైతం స్పష్టం చేసింది. అయితే సర్కారు టెట్ ఎగ్జామ్ పెట్టకముందే టీచర్ జాబ్స్పై కసరత్తు చేపడుతోందని బయట వైరల్ కావడంతో నిరుద్యోగులు టెన్షన్కు గురవుతున్నారు. అసలు టెట్ పెట్టకుండా జాబ్ కోసం ఎగ్జామ్స్ ఎట్లా కండక్ట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఆర్నెల్లకోసారి పెట్టాల్సి ఉండగా..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో టెట్ ను ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఐదేండ్లలో కేవలం నాలుగు సార్లు మాత్రమే నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ ఏడేళ్ల లో ప్రభుత్వం కేవలం రెండుసార్లు మాత్రమే టెట్ నిర్వహించింది. అభ్యర్థి ఒకసారి టెట్ రాసి క్వాలిఫై అయితే దాని కాలపరిమితి ఏడేళ్లు ఉంటుంది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు సార్లు టెట్ నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2014 మార్చిలో చివరిసారిగా నిర్వహించిన టెట్ ఏడేళ్ల వ్యాలిడిటీ వచ్చే మార్చి నెలతో ముగియనుంది. సాధారణంగా ప్రతి ఆరు నెలలకోసారి నిర్వహించాల్సిన టెట్ పరీక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారిగా 2016 మే నెలలో, ఆ తర్వాత 2017 జులై లో నిర్వహించింది. అప్పటి నుంచి క్వాలిఫైడ్ స్టూడెంట్స్ టీచర్జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు.
మూడేండ్లుగా రాని నోటిఫికేషన్
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నిర్వహించిన టెట్ పరీక్షలో మొదట్లో అర్హత సాధించిన అభ్యర్థుల క్వాలిఫై గడువు ముగియడంతో మళ్లీ టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటివారు రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది వరకు ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో 2017 జులైలో చివరిసారి పరీక్ష పెట్టారు. అదే ఏడాది బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు అవకాశాన్ని వినియోగించుకున్నారు. తర్వాత 2017 నుంచి 2020 వరకు నాలుగేళ్లలో డీఎడ్, బీఎడ్ పూర్తి చేసిన వారంతా టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. నాలుగు నెలల క్రితం టెట్క్వాలిఫై వ్యాలిడిటీని లైఫ్ టైం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే రాష్ట్ర సర్కారు టెట్నిర్వహించకపోవడంతో నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. టీచర్ల ఖాళీలను కాస్త లేటుగా భర్తీ చేసినా టెట్మాత్రం ప్రతి ఏడాది క్రమం తప్పకుండా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
టెట్ రెగ్యులర్గా నిర్వహించాలి
టీటీసీ కంప్లీట్ చేసి మూడేళ్లయినా నోటిఫికేషన్ రాలేదు. టెట్ కోసం అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నా. ప్రభుత్వం నిర్వహించే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్(టీఆర్టీ)లో 20శాతం మార్కులుగా టెట్ వెయిటేజీ ఉంటుంది. ఇటీవల విడుదలైన కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఒకసారి టెట్ అర్హత సాధిస్తే లైఫ్టైమ్ ఉంటుందని పేర్కొంది. ఇప్పటికైనా ప్రభుత్వం త్వరగా టెట్ నిర్వహించాలి. –పావని, టీటీసీ, జగిత్యాల.
ఇవి కూడా చదవండి