గవర్నర్ బిల్లులు ఆమోదించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై సుప్రీంలో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. 2022 సెప్టెంబర్ నుంచి బిల్లులను పెండింగ్ లో పెట్టారని .. గవర్నర్ చట్టానికి కట్టుబడి ఉండాలని కోర్టుకు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో వారం రోజుల్లో బిల్లులు ఆమోదిస్తున్నారన్న దుష్యంత్ దవే.. బిల్లులు పెండింగ్ లో పెడ్తే ప్రజల్లోకి తప్పుడు మెసేజ్ వెళ్తుందన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను ఆమోదించాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. దుష్యంత్ దవే వాదనలు విన్న సుప్రీం తదుపరి విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది.
గవర్నర్ తమిళిసై బిల్లులను ఆమోదించకపోవడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.. విచారణ సందర్భంగా రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ కు నోటీసులు జారీ చేయలేమన్న సుప్రీం..కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 27 కు వాయిదా వేసింది. ఈ క్రమంలో ఇవాళ( మార్చి 27న ) సుప్రీం విచారణ జరిపింది.
గవర్నర్ ఆమోదించడం లేదని సర్కారు తెలిపిన బిల్లులివే..!
- ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ బిల్లు
- తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు
- తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సవరణ బిల్లు
- తెలంగాణ యూనివర్సిటీల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు
- ద యూనివర్సిటీస్ ఆఫ్ ఫారెస్ట్రీ తెలంగాణ బిల్లు
- తెలంగాణ మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ చట్ట సవరణ బిల్లు
- తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్(ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్) అమెండ్మెంట్ బిల్లు
- ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్అగ్రికల్చర్ యూనివర్సిటీ అమెండ్మెంట్ బిల్లు
- తెలంగాణ పంచాయతీ రాజ్ చట్ట సవరణ తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ-2