
- కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చే ప్రాజెక్టులకే నిధులు!
- 75 % పనులు పూర్తయిన వాటికే బడ్జెట్ లో కేటాయింపులు
- కొత్తగా 6 లక్షల ఎకరాల ఆయకట్టకు నీళ్లివ్వాలని ప్రభుత్వ లక్ష్యం
- గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం చేసిన ప్రాజెక్టులపై ఫోకస్
హైదరాబాద్, వెలుగు: కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చే ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 75 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టులకే రానున్న బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించాలని యోచిస్తోంది. 2024–25 వాటర్ ఇయర్లో కొత్తగా 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేసీఆర్ పదేండ్ల పాలనలో నిర్లక్ష్యం చేసిన ప్రాజెక్టులను పూర్తి చేసి, కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని భావిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్లలో ప్రాజెక్టుల కోసం రూ.1.82 లక్షల కోట్లు ఖర్చు చేసి, 17.24 లక్షల ఎకరాలకే నీళ్లు ఇచ్చారు. అందులోనూ 13 లక్షల ఎకరాలు ఉమ్మడి ఏపీలో అప్పటి కాంగ్రెస్ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టుల కిందనే ఇచ్చారు.
ఇంకో 2 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు 2004కు ముందు మొదలుపెట్టిన వాటి కిందనే ఇచ్చారు. బీఆర్ఎస్ భారీ ఎత్తున ప్రజాధనం ఖర్చు చేసి కట్టిన ప్రాజెక్టులతో పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని, ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం ఆయకట్టుకు నీళ్లిచ్చే ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇటీవల ప్రకటించారు. అందుకు అనుగుణంగానే బడ్జెట్కేటాయింపులు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఇరిగేషన్కు రూ.37 వేల కోట్ల బడ్జెట్కావాలని ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపగా.. అందులో అప్పుల రీపేమెంట్లు, ఇతరత్రా ఖర్చులకే రూ.20 వేల కోట్లకు పైగా ప్రతిపాదించారు.
ఏడాదిలోనే నీళ్లియ్యాలని టార్గెట్..
ఏఎమ్మార్ ఎస్ఎల్బీసీ, శ్రీపాద ఎల్లంపల్లి లిఫ్ట్ స్కీమ్, దేవాదుల ఎత్తిపోతలు, కోయిల్సాగర్, ఇందిరమ్మ వరద కాలువ, నిజాం సాగర్ మోడ్రనైజేషన్, పాలెం వాగు, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు లిఫ్ట్ స్కీమ్లు, ఎస్సారెస్పీ స్టేజీ –2, కుమ్రంభీమ్, లెండి ప్రాజెక్టుల పనులు 75 శాతానికి పైగా పూర్తయ్యాయి. వీటిని రానున్న మూడేండ్లలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ.14,668 కోట్ల నిధులు అవసరం కాగా, రాబోయే ఆర్థిక సంవత్సరంలో రూ.8,542 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు.
ఈ ప్రాజెక్టుల కింద మొత్తం ఆయకట్టు 10.22 లక్షల ఎకరాలు ఉండగా, అందులో దాదాపు 4 లక్షల ఎకరాలు సాగులోకి తేవాలని టార్గెట్ పెట్టుకున్నారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్(ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టు, నక్కలగండి, ఉదయసముద్రం లిఫ్ట్ స్కీమ్ ల కింద 4 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశముంది. ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వం పదేండ్లలో కాలంలో కనీసం పట్టించుకోలేదు. టన్నెల్ బోరింగ్ మిషన్కు సంబంధించిన బ్లేడ్లు, ప్లేట్లు, ఇతర సామగ్రిని నిర్మాణ సంస్థ విదేశాల నుంచి తెప్పించినా నిధులు ఇవ్వకపోవడంతో అవి పోర్టులోనే ఉండిపోయాయి. టన్నెల్లో వచ్చే నీటిని తోడటానికి నెలకు రూ.2 కోట్లకు పైగా కరెంట్ బిల్లులు అవుతున్నాయి.
ఈ ప్రాజెక్టును టాప్ ప్రయారిటీగా పెట్టుకొని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఈ ప్రాజెక్టుకు రూ.వెయ్యి కోట్ల వరకు నిధులిచ్చే అవకాశముంది. ఉమ్మడి ఏపీలో ప్రతిపాదించిన నారాయణపేట్– కొడంగల్ లిఫ్ట్ స్కీమ్ ను కూడా బీఆర్ఎస్ హయాంలో పక్కనపెట్టారు. ఇప్పుడా ప్రాజెక్టుకు రాబోయే బడ్జెట్లో రూ.300 కోట్లకు పైగా కేటాయించే అవకాశముంది. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు నీళ్లిచ్చే ప్రాణహిత ప్రాజెక్టు (తుమ్మిడిహెట్టి బ్యారేజీ)కు కేటాయింపులు చేసే చాన్స్ ఉంది. మొత్తంంగా 6 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు రానున్న ఏడాది కాలంలోనే నీళ్లిచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
కాళేశ్వరానికి కేటాయింపులుండవ్..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు లైఫ్లైన్పేరుతో హంగామా చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రానున్న బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు ఉండబోవని తెలుస్తోంది. ఆ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడం, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, మిగతా బ్యారేజీల్లోనూ లోపాలు వెలుగుచూడడం, పంపుహౌస్లు మునిగిపోవడంతో దానిలో నిజాలు నిగ్గు తేల్చాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇక గత సర్కార్ హయాంలో పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకూ భారీ వ్యయమే చేసినా, ఆయకట్టుకు నీళ్లిచ్చే పనులు మాత్రం చేయలేదు.
ఆ ప్రాజెక్టుకు చాలా పర్మిషన్లు రావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆ ప్రాజెక్టుకు నామమాత్రపు కేటాయింపులే చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.93 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి, కేవలం 98 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చింది. పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్స్కీమ్ కోసం రూ.37,514 కోట్లు, సీతారామ ఎత్తిపోతల(సీతమ్మ సాగర్బ్యారేజీ కలుపుకొని)కు రూ.8,634 కోట్లు ఖర్చు చేసినా వాటి కింద ఒక్క ఎకరానికీ నీళ్లు ఇవ్వలేకపోయారు.
ఈ రెండు ప్రాజెక్టుల కింద తక్కువ ఖర్చుతో ఇప్పటికిప్పుడు నీళ్లిచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వం అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. రూ.1,093 కోట్లు ఖర్చు చేసిన చనకా-కొరాట ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీళ్లిచ్చే ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలిస్తోంది. మంథని నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చే చిన్న కాళేశ్వరంపై ఇప్పటికే రూ.399 కోట్లు ఖర్చు చేయగా, ఇంకో రూ.250 కోట్ల వరకు ఖర్చు చేస్తే 42 వేల ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశముందని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.