హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర డీఎస్సీ నోటిఫికేషన్లో డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ)ల పోస్టుల భర్తీకి వివరాలు లేక పోవడంపై వివరణ ఇవ్వాలని విద్యాశాఖ ఆఫీసర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పాఠశాల విద్య, ఆర్థిక, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శులు, ఎన్సీటీఈ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్, డైట్ ప్రిన్సిపాల్ (మెదక్)కు నోటీసులిచ్చింది. తదుపరి విచారణను వచ్చే నెల 7కి వాయిదా వేస్తున్నామని, ఈలోగా సమగ్ర వివరాలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
2020 నాటి కేంద్ర విద్యావిధానం ప్రకారం..రాష్ట్ర సర్కార్ జారీ చేసిన జీవో 25లో డీపీఎస్ఈ అభ్యర్థులను చేర్చలేదంటూ ఆకుల సురేశ్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ సూరేపల్లి నంద ఇటీవల విచారించి పైవిధంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఉచిత విద్య, డ్రాపౌట్ రేట్ను తగ్గించడం వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్ లాయర్ కోర్టుకు చెప్పారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్లో ప్రీస్కూల్ విద్య అంశం లేదన్నారు.
కేరళ, పంజాబ్, ఏపీల్లో అమలు అవుతున్నదని చెప్పారు. తెలంగాణలో మాత్రం అమలు చేయడం లేదన్నారు. 2017లో డీపీఎస్ఈ కోర్సును 50 మందితో ప్రారభించి నాలుగు బ్యాచ్లను పూర్తి చేశాక డిప్లమో పరీక్ష నిర్వహణను ప్రైవేట్ వాళ్లకు అనుమతి ఇచ్చిందన్నారు. తెలంగాణలోని వారికి న్యాయం జరిగేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.