హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోని వినియోగదారుల కమిషన్లకు చెందిన ప్రాదేశిక అధికార పరిధిని మార్పు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. 2022 నాటి సర్కూలర్ ను పక్కన పెట్టింది. రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఇన్ చార్జ్ అధ్యక్షురాలు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. రాష్ట్ర కమిషన్ అధ్యక్షుల హోదాలో హైదరాబాద్ లోని జిల్లా కమిషన్ల అధికార పరిధిని నిర్ణయించవచ్చని, కానీ ఆ పరిధిని మార్చేందుకు కారణాలను స్పష్టం చేయకపోవడాన్ని తప్పుపట్టింది.
కారణాలను వివరిస్తూ ట్రాన్స్ పరెంట్ గా నిర్ణయం ఉండాలని చెప్పింది. జిల్లా కమిషన్ల అడ్వకేట్ల సంఘం ఇచ్చిన వినతి పత్రానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం సబబు కాదని పేర్కొంది. హైదరాబాద్ లోని మూడు జిల్లా కమిషన్ల ప్రాదేశిక అధికార పరిధిని మార్పు చేస్తున్నట్లు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ లాయర్ రాఘవేంద్రసింగ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ పి. శ్యాంకోశీ, జస్టిస్ ఎన్. తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచి ఇటీవల తీర్చు చెప్పింది.
లాయర్ల వినతితో నిర్ణయం తగదు
హైదరాబాద్ లోని మూడు జిల్లా కమిషన్లు నాంపల్లిలోని చంద్రవిహార్ నుంచి విధులు నిర్వహిస్తున్నాయి. కమిషన్-1లో కేసులు ఎక్కువగా ఉండగా మిగిలిన 2,3 కమిషన్లలో కేసులు లేక మధ్యాహ్నంలోగానే విచారణ పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా వినియోగదారుల కమిషన్ న్యాయవాదుల సంఘం వినతి మేరకు కేసుల విభజన బాధ్యతను కమిషన్-1కి అప్పగిస్తూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ రిజిస్ట్రార్ లేఖ రాశారు. కేసులు విభజన వివక్షతతో కూడుకుంటున్నాయని పిటిషనర్ వాదన. దీనిపై స్పందించిన హైకోర్టు.. కేసుల సంఖ్య తక్కువగా ఉన్న విషయాన్ని వివరిస్తూ విభజన చేయవచ్చునని, లాయర్ల సంఘం ఇచ్చిన వినతిపై నిర్ణయం తీసుకోవడం తగదని స్పష్టం చేసింది. తగిన కారణాలపై వివరణ లేకుండా విభజన చేయడం
సరికాదని పేర్కొంది.