హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం (2022 23) కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వల్ల గతేడాది (2022) కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. తాజాగా పదో తరగతి పరీక్షలపై ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం... ఈ ఏడాది నుంచి 6 పేపర్లకే పరీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.
కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులపై భారం పడకుండా 2021-2022 విద్యా సంవత్సరంలో టెన్త్ పరీక్ష పేపర్లను 11 నుంచి 6కు కుదించారు. గతంలో తెలుగు, ఇంగ్లీష్, గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులను రెండు పేపర్లుగా పరీక్ష నిర్వహించేవారు. హిందీ సబ్జెక్ట్కు ఒకే పరీక్ష ఉండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల ఈ ఏడాది నుంచి ప్రతి సబ్జెక్ట్ కు ఒకటే పేపర్ ఉండనుంది.