
- ఏప్రిల్లో రాష్ట్ర రాబడి రూ.15,085 కోట్లు
హైదరాబాద్, వెలుగు: ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే అంటే గడిచిన ఏప్రిల్లో రాష్ట్ర సర్కార్ రూ.5, 029 కోట్లు అప్పు చేసింది. కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) నెలవారీ రిపోర్ట్లో వెల్లడించింది. దీని ప్రకారం ఏప్రిల్లో రాష్ట్ర ఖాజానాకు చేరిన మొత్తం ఆదాయంలో దాదాపు 34 శాతం అప్పులే ఉన్నాయి. మొత్తం రాబడి రూ.15,085 కోట్లు ఉన్నది. ఇందులో అప్పులు మినహా జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, సేల్స్ టాక్స్, ఎక్సైజ్ రాబడి, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, ఇతర టాక్స్లతో వచ్చిందే ఉన్నది. ఇక ఈ నెలలోనూ సర్కార్ నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది. మంగళవారం ఇంకో వెయ్యి కోట్లు తీసుకునేందుకు రెడీ అయింది. ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి టాక్స్ రెవెన్యూ రూ.9,698 కోట్లు వచ్చింది. ఇందులో జీఎస్టీ రాబడినే సగం ఉన్నది. జీఎస్టీతో రూ.4,081 కోట్లు ఆదాయం సమకూరింది.