
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రూప్ 2, 4 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ రెడీ అవుతోంది. వచ్చే నెలలో ఈ రెండు నోటిఫికేషన్లు రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికోసం సోమవారం నుంచి డిపార్ట్మెంట్ల వారీగా సమావేశాలు నిర్వహించనున్నది. శనివారం టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన కమిషన్ సమావేశం జరిగింది. దీంట్లో గ్రూప్స్ నోటిఫికేషన్, ఇతర అంశాలపై చర్చించారు. ఇప్పటికే గ్రూప్ 2 ద్వారా 663, గ్రూప్ 3లో 1,373, గ్రూప్ 4 ద్వారా 9,168 పోస్టులను భర్తీ చేసేందుకు ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ఆమోదం తెలిపింది.
తాజాగా గ్రూప్ 2లో సర్కారు కొత్త పోస్టులను చేర్చింది. దీనిద్వారా 60 పోస్టుల వరకు పెరిగే అవకాశముందని అధికారులు చెప్తున్నారు. గ్రూప్ 3లోనూ కొన్నిపోస్టులు పెరిగే అవకాశముంది. డిపార్ట్మెంట్లతో మీటింగ్స్ తర్వాత కొత్త రోస్టర్ ఇండెంట్లపై సమీక్ష చేయనున్నారు. డిసెంబర్లో గ్రూప్ 2, 4 నోటిఫికేషన్ వస్తుందని, త్వరలోనే హారిజాంటర్ రిజర్వేషన్లపై క్లారిటీ రానున్నదని టీఎస్పీఎస్సీ అధికారి ఒకరు చెప్పారు.