గ్రూప్ 1 రద్దుపై అప్పీల్​కు.. టీఎస్ పీఎస్సీ నిర్ణయం

గ్రూప్ 1 రద్దుపై అప్పీల్​కు.. టీఎస్ పీఎస్సీ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో టీఎస్ పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకున్నది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ కు అప్పీల్​కు వెళ్లాలని నిర్ణయించింది. శనివారం కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇందులో హైకోర్టు తీర్పుపై చర్చించారు. అంతకుముందే తీర్పుపై న్యాయనిపుణులతో చర్చించిన వివరాలను కమిషన్ సభ్యులకు చైర్మన్ వివరించారు. గతంలో సింగరేణి ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్​ను సింగిల్ జడ్జి రద్దు చేయగా, ఆ తర్వాత డివిజన్ బెంచ్ ఆ తీర్పును కొట్టేసిన విషయం మీటింగ్​లో చర్చకు వచ్చినట్టు తెలిసింది. 

బయోమెట్రిక్ అటెండెన్స్ పెట్టకపోవడం, అభ్యర్థుల సంఖ్య పెరగడం, ఓఎంఆర్ షీట్లపై హాల్ టికెట్ నంబర్ లేకపోవడం తదితర హైకోర్టు లేవనెత్తిన అభ్యంతరాలపై సరైన సమాధానం చెప్పలేకపోయామని అభిప్రాయపడినట్టు సమాచారం. గతంలో గ్రూప్ 1 పరీక్ష సమయంలో బయోమెట్రిక్ అటెండెన్స్ పెట్టామని, ఎగ్జామ్ సెంటర్లలో చివరి నిమిషంలో అభ్యర్థుల ఫ్లోటింగ్ పెరగడంతో కొంత ఇబ్బంది ఎదుర్కొన్నామని.. దాంతోనే ఈసారి పెట్టలేకపోయామని అధికారులు అంటున్నారు. మరోపక్క బయోమెట్రిక్ అటెండెన్స్ లేదనే విషయాన్ని పరీక్షకు ముందే హాల్ టికెట్లలో ప్రకటించామని చెబుతున్నారు. అప్పుడు కోర్టుకు వెళ్లకుండా, పరీక్ష తర్వాత పోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని అంటున్నారు. పరీక్ష నిర్వహణలో తమ తప్పేమీ లేదని అంటున్న కమిషన్ అధికారులు.. అవసరమైతే సుప్రీంకోర్టు దాకా వెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది. 

అవి టెంటెటివ్ వివరాలంటున్న కమిషన్.. 

జూన్ 11న ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగ్గా, దానికి సంబంధించిన అటెండెన్స్ వివరాలను ఆ రోజు రాత్రి టీఎస్ పీఎస్సీ రిలీజ్ చేసింది. 2,33,248 మంది హాజరయ్యారని తెలిపింది. అయితే ఆ తర్వాత 2,33,506 మంది అటెండ్ అయ్యారంటూ అభ్యర్థుల ఓఎంఆర్ వివరాలను వెబ్ సైట్ లో పెట్టింది. దీంతో కొత్తగా 258 మంది అభ్యర్థులు ఎలా వచ్చారని అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. అయితే తాము పరీక్ష రోజు ఇచ్చిన వివరాలు టెంటెటివ్ అని ముందుగానే ప్రకటించామని టీఎస్ పీఎస్సీ అంటోంది. ఎన్నికల టైమ్ లో పోలింగ్ రోజు ఇచ్చే పర్సంటేజీ, ఆ తర్వాత ప్రకటించే పర్సంటేజీ వేర్వేరుగా ఉంటుందని.. ఇదే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఓఎంఆర్ షీట్లపై గతంలో పేర్లు, ఇతర వివరాలు ఇస్తే గందరగోళం నెలకొన్నదని.. అందుకే ఖాళీ ఓఎంఆర్ షీట్లను ఇచ్చామనే విషయాన్ని కోర్టుకు వివరించాలని మీటింగ్​లో నిర్ణయించినట్టు తెలిసింది.