హైదరాబాద్​ ప్రయాణికులకు గుడ్​న్యూస్.. బస్సు ఎక్కడుందో ఇక టెన్షన్​ అక్కర్లే

హైదరాబాద్​ ప్రయాణికులకు గుడ్​న్యూస్.. బస్సు ఎక్కడుందో ఇక టెన్షన్​ అక్కర్లే

బస్సుల కోసం ఎదురు చూసే వారి వేదన అంతా ఇంతా కాదు. ఎప్పుడొస్తాయో తెలియక ఓపికలు నశిస్తున్నా వేచి చూడాల్సిన దుస్థితి ఉంటుంది. దీంతో బస్టాపుల్లో గంటల తరబడి వెయిట్​ చేయాల్సి వస్తోంది. 

ఈ బాధలు తప్పించడానికే టీఎస్ఆర్టీసీ ఓ కొత్త ఐడియాతో ముందుకు వచ్చింది. మనం ట్రావెల్​ చేయబోయే బస్సు ఎక్కడ ఉంది తదితర వివరాలన్నీ ఇకపై ఫోన్లోనే చూసుకోవచ్చు.ఆ వివరాల్లోకి వెళ్తే... ఆర్టీసీ యాజమాన్యం రూపొందించిన ఓ యాప్​ ఇప్పుడు ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. 

ఆ యాప్​ ముఖ్య ఉద్దేశం వెహికిల్​ ని ట్రాకింగ్​చేయడం. కొన్ని రోజుల కింద ప్రయోగాత్మకంగా పరిశీలించిన వెహికిల్​ ట్రాకింగ్​ వ్యవస్థను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని అధికారులు యోచిస్తున్నారు. 

గ్రేటర్​ హైదరాబాద్​పరిధిలోని అన్ని బస్సులను జీపీఎస్ అనుసంధానించడం ద్వారా ఏ బస్సు ఎక్కడ ఉంది, అది ఎంత సమయంలో వస్తుంది తదితర వివరాలు ఈజీగా తెలిసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన  టీఎస్‌ఆర్టీసీ వెహికిల్‌ ట్రాకింగ్‌ మొబైల్‌ యాప్‌ను  ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ ఆగస్టు 12న ఎంజీబీఎస్ లో ప్రారంభించనున్నారు. 

నగరంలోని వివిధ మార్గాల్లో తిరిగే సుమారు 2 వేల 850  బస్సులతో పాటు ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే మరో  2 వేల 500లకుపైగా బస్సుల్లో వెహికిల్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. 

బస్సు కోసం విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా ఇంటి నుంచి బయల్దేరేటప్పుడే జర్నీని ప్లాన్​ చేసుకోవచ్చన్నమాట. దీనికి తోడు అప్పటికే ఆ రూట్లలో నడుస్తున్న బస్సుల వివరాలూ యాప్​లో ఉంటాయి.