
మెహిదీపట్నం, వెలుగు: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలల్లోని టీచర్లకు బదిలీలు, పదోన్నతుల కాలపట్టిక ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బుధవారం టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో సంక్షేమ భవన్లోని గిరిజన సంక్షేమ కమిషనర్ ఆఫీసుకు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి ఆందోళన చేపట్టారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొంది. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె. జంగయ్య అధ్యక్షత వహించి మాట్లాడుతూ.. గిరిజన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై కమిషనర్ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు.
షెడ్యూలును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖ 1800 పాఠశాలల్లో ఆరు వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాములు, టీఎస్ యూటీఎఫ్ నాయకులు లక్ష్మారెడ్డి, శాంతకుమారి, లావణ్య, కిశోర్ సింగ్, పి. నాగేశ్వరరావు, ఎన్ కృష్ణ, వాసుదేవరెడ్డి, రాందాస్, బాలు, భద్రు, అనసూయ, డి నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు చందన్, సనత్ కుమార్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.