2937 కోట్లతో టీటీడీ బడ్జెట్.. ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి

2937 కోట్లతో టీటీడీ బడ్జెట్.. ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి

తిరుపతి: రూ. 2937.82 కోట్లతో టీటీడీ బడ్జెట్ కు పాలక మండలి ఆమోదముద్ర వేసింది. అలాగే ఏప్రిల్ 14 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతివ్వాలని పాలక మండలి నిర్ణయించింది. గోవును జాతీయ ప్రాణి గా గుర్తించాలని అలాగే టీటీడీ ఉద్యోగులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేయించాలని టీటీడీ పాలక మండలి సమావేశం తీర్మానాలు చేసింది. తిరుమల అన్నమయ్య భవన్ లో శుక్రవారం తిరుపతి దేవస్థానం పాలకమండలి 2021 – 22 బడ్జెట్ సమావేశం జరిగింది.  టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సమావేశం అనంతరం మీడియాకు తీర్మానాల వివరాలు తెలిపారు. ముందస్తు రిజర్వేషన్ తో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏప్రిల్ 14వ తేదీ నుంచి భక్తులను శ్రీవారి  ఆర్జిత సేవలకు అనుమతించాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. గుడికో గోమాత కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా వస్తున్న స్పందన వల్ల గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని తీర్మానించామన్నారు.

ముందస్తుగా బుకింగ్ చేసుకున్న భక్తులను ఏప్రిల్ 14వ తేదీ నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతిస్తామన్నారు. ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు  కోవిడ్ 19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. సేవకు వచ్చే మూడు రోజుల ముందు కోవిడ్ పరీక్ష చేయించుకుని సర్టిఫికెట్ సమర్పించాలి. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రవేశ పెట్టేందుకు ఆమోదించామన్నారు. టీటీడీ పరిధిలోకి ఇతర ఆలయాలను తీసుకోవడానికి విధి విధానాలను నిర్ణయించడం జరిగిందని, ఇలాంటి ఆలయాలకు శ్రీవాణీ ట్రస్ట్ నుండి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందని టీటీడీ ఛైర్మన్ వివరించారు.

టీటీడీ కళ్యాణ మండలపాల నిర్మాణం, లీజు, నిర్వహణపై గైడ్ లైన్స్

టీటీడీ కళ్యాణ మండపాలు నిర్మాణం,  లీజుకు ఇవ్వడం, నిర్వహణకు సంబంధించి ఏక రూప మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఉన్న కళ్యాణ మండపాలు సక్రమంగా నిర్వహించి నష్టాలు తగ్గించుకోవాలని తీర్మానం చేశారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఆరు వేద పాఠశాలల పేరును ఇకపై శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం గా మార్చేందుకు ఆమోదం తెలిపింది. బర్డ్ ఆసుపత్రిలోని పాత ఓపిడి భవనం, మొదటి అంతస్తులో వేంకటేశ్వర పీడియాట్రిక్ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి సివిల్, ఎలక్రిటికల్, ఏసీ తదితర అభివృద్ధి పనులకు రూ 9 కోట్ల.మంజూరుకు ఆమోదం తెలిపారు. అదేవిధంగా కొత్త ఓపిడి భవనంలో మూడవ అంతస్తు విస్తరణ పనులకు రూ.3.75 కోట్లతో టెండర్ల ఆమోదం తెలిపారు. టీటీడీ ప్రసాదాలు, అన్న ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యి ట్యాంకుల సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 82.4 మెట్రిక్ టన్నుల నుండి 180.4 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచేందుకు ఆమోదం. తద్వారా నెయ్యి నిల్వలను ఆరు రోజుల నుంచి 14 రోజులకు పెంచుకోవచ్చని తీర్మానం చేశారు.

తిరుమలలో 50 మెగావాట్లతో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి

తిరుమలలోని అన్ని వసతి, విశ్రాంతి గృహాలు, సత్రాల వద్ద విద్యుత్ వినియోగానికి సంబంధించి జవాబుదారీ తనం పెంచేందుకు ఏపీ SPDCL ద్వారా విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. అలాగే తిరుమలలో క్రమంగా  50 మెగావాట్ల  గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ముంబై, జమ్మూలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి భూమి పూజ చేయాలని నిర్ణయించారు.

శ్రీవారి మెట్టు మార్గంలో అన్నప్రసాదం

శ్రీవారి మెట్టు మార్గంలో నడచి వచ్చే భక్తులకు అన్న ప్రసాదం అందించాలని పాలక మండలి నిర్ణయించింది. అలాగే అయోధ్యలో రామమందిర నిర్మాణ ట్రస్ట్  టీటీడీకి భూమి కేటాయిస్తే శ్రీవారి ఆలయం లేదా భజన మందిరం లేదా యాత్రికుల వసతి సముదాయంలో వారు ఏది కోరితే అది నిర్మించాలని తీర్మానం చేశారు. మీడియా సమావేశంలో టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, పాలకమండలి సభ్యులు  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శివకుమార్, గోవింద హరి, డిపి అనంత, శ్రీ రాములు, డాక్టర్ వాణి మోహన్ పాల్గొన్నారు.

For More News..

కాణిపాకం టెంపుల్‌కు 7కోట్లు విరాళమిచ్చిన అజ్ఞాత భక్తుడు

ఏపీ సచివాలయం వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం

క్లాస్ రూమ్‌లో లేడీ టీచర్ పై కత్తితో దాడి