
తిరుపతి: కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం టీటీడీ తరఫున టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. కాణిపాకంలో గురువారం వరసిద్ధి వినాయక స్వామి తిరు కల్యాణం సందర్భంగా టీటీడీ తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రతి ఏడాదీ బ్రహ్మోత్సవాల సమయంలో పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
కాణిపాకం ఆలయం దగ్గరకు చేరుకున్న టీటీడీ ఛైర్మన్కు కాణిపాకం ఆలయ ఈవో పెంచెల కిషోర్ కుమార్, ఏఈవో రవీంద్ర బాబు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణం చేసి గర్భాలయంలో స్వామివారికి వస్త్ర సమర్పణ చేశారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు.