తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణపై ఫోకస్... అధికారులతో ఈవో ధర్మారెడ్డి సమీక్ష

తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణపై ఫోకస్... అధికారులతో ఈవో ధర్మారెడ్డి సమీక్ష

ఇటీవల కాలంలో తిరుమల ఘాట్ రోడ్డులో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వరుస ఘటనలతో టీటీడీ ప్రమాదాల నివారణపై ఫోకస్ పెట్టింది. టీటీడీ ఈవో ధర్మారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు.. వారికి దిశా నిర్దేశం చేశారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నచోట ప్రత్యేకంగా నిఘా పెట్టాలని.. అలాగే రోలర్ పోస్టర్ బ్యారియర్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే టీటీడీ సెక్యూరిటీ పోస్టులను ఏర్పాటుపై ఫోకస్ పెట్టాలని చెప్పారు.

తిరుమల ఘాట్ రోడ్ ప్రమాదాలకు ఫుల్‌స్టాప్‌ పడేలా టీటీడీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. యాక్సిడెంట్స్  నివారణ కొరకు ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ గా గుర్తించిన పోలీసు యంత్రాంగం....6 చోట్ల అత్యంత ప్రమాదకరమైన మలుపులు ఉండడంతో బ్లాక్ స్పాట్లుగా గుర్తించారు అధికారులు. ఈవరుస ప్రమాదాలపై టీటీడీ ఫోకస్ చేసింది. కోవిడ్ తర్వాత సొంత వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిపోవడంతో పాటు ఘాట్ రోడ్ ప్రయాణంపై అవగాహన లేకపోవడంతో యాక్సిడెంట్స్‌ జరుగుతున్నట్లు గుర్తించారు టీటీడీ అధికారులు.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల భద్రత దృష్ట్యా ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణపై ఫోకస్ పెట్టింది టీటీడీ. ఈ మేరకు కార్యచరణ ప్రణాళికలు సిద్ధం చేసి, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో కార్యాలయంలో జేఈవో వీరబ్రహ్మంతో కలిసి విజిలెన్స్, పోలీస్, వైద్య ఆర్టీసీ, ఫారెస్ట్, స్విమ్స్, బర్డ్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ALSO READ:మంత్రి మల్లారెడ్డికి మరోసారి నిరసన సెగ.. కాన్వాయిని అడ్డుకున్న గ్రామస్తులు

తిరుమల రెండు ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు జిల్లా ఎస్పీతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సీవీఎస్‌వో నరసింహ కిషోర్‌ను ఆదేశించారు. ఘాట్ రోడ్లలో ప్రమాదాలు జరిగినప్పుడు విజిలెన్స్ సిబ్బంది స్విమ్స్, బర్డ్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి అధికారులను అప్రమత్తం చేయాలన్నారు. ఎటువంటి ఆలస్యం లేకుండా క్షతగాత్రులకు చికిత్స చేయడానికి ఒక యాక్షన్ టీమ్ సిద్ధంగా ఉంటుందన్నారు. స్విమ్స్ వద్ద పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలన్నారు. ఘాట్ రోడ్లలో ప్రమాదకరమైన అవ్వచారికోన, కపిలతీర్థం పైభాగంలో మాల్వాడి గుండం దగ్గర రోలర్ పోస్టర్ బ్యారియర్ ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం అలిపిరి సమీపంలో పార్కింగ్ ప్రదేశాన్ని గుర్తించి వాహనాల పార్కింగ్, డ్రైవర్లను అందుబాటులో ఉంచేందుకు, తిరుమలలో ప్రీ పెయిడ్ టాక్సీ సేవలను అందించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఘాట్ రోడ్లలో ప్రమాదాలకు గురయ్యే వాహనాలను గుర్తించి రాకపోకలను నిషేధించడంతో పాటు, ఘాట్ రోడ్లలో నిఘా కోసం టీటీడీ సెక్యూరిటీ పోస్టులను ఏర్పాటు చేయాలని సూచించారు.