
ఖమ్మం, వెలుగు: ఈ నెల 25లోగా రైతుభరోసా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తెలిపారు. పండ్ల తోటలు వేసినోళ్లకు సైతం రైతు భరోసా ఇచ్చే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. శుక్రవారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో మీడియాతో తుమ్మల చిట్చాట్ చేశారు. రైతులకు అవసరమైన ఎరువులను సిద్ధం చేశామని ఆయన తెలిపారు. ఎరువుల గురించి కేంద్రమంత్రి జేపీ నడ్డాతో సీఎం రేవంత్రెడ్డి చర్చించారని చెప్పారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆఫీసర్లను ఆదేశించామని పేర్కొన్నారు.
‘‘గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు తప్ప మిగతా అన్ని పథకాలు ఆపేశారు. మేం అధికారంలోకి వచ్చాక పాత రుణమాఫీని సైతం అమలు చేశాం. కాళేశ్వరం విషయంలో కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కమిషన్ ముందు ఈటల నా ప్రస్తావన తీసుకురావడం వల్లే నేను రిపోర్ట్ ఇవ్వాల్సి వచ్చింది” అని చెప్పారు. ‘‘కాంగ్రెస్ అధికారంలో లేనప్పటికీ ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతం కోసం భట్టి విక్రమార్క పనిచేశారు. జిల్లా పదవులు నా మనుషులకు ఇస్తే స్వార్థమవుతుంది. రెండో విడతలో నా అనుచరులకు పదవులు ఇప్పిస్తాను. నేను న్యాయానికి తప్ప దేనికీ లొంగను. సీఎంకు సమస్య వచ్చేలా ఏ పని చేయను” అని అన్నారు.