హైదరాబాద్ లో నకిలీ మైసూర్ శాండల్ సోప్స్.. తయారు చేస్తున్న ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్ లో నకిలీ మైసూర్ శాండల్ సోప్స్..  తయారు చేస్తున్న ఇద్దరు అరెస్ట్

కల్తీకి కాదేదీ అనర్హం అంటున్నారు నకిలీ కేటుగాళ్లు.. ప్రతి వస్తువును కల్తీ చేస్తున్నారు. ఏది డిమాండ్ ఉంటుందో.. మార్కెట్లో  ఏది బాగా అమ్ముడు పోతుందో అలాంటి బ్రాండ్ లను ఎంచుకొని నకిలీవి తయారు చేసి అడ్డదారిలో సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు కల్తీగాళ్లు..  ముఖ్యంగా జనం ఎక్కువగా నివసించే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఈ కల్తీ వస్తువుల తయారీ విపరీతంగా ఉంది. నూనెలు, అల్లం వెల్లుల్లి పేస్ట, సబ్బులు, ఆఖరికి పిల్లలు తినే చాక్లెట్లు, ఐస్ క్రీమ్ లను కూడా వదలకుండా నకిలీ తయారు చేసి విపరీతంగా సంపాదించేస్తున్నారు.. తాజాగా కర్ణాటకకు చెందిన మైసూర్ శాండల్ సోప్ లను నకిలీవి తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలేంటో చూద్దాం. 

కర్ణాటక ప్రభుత్వానకి  చెందిన కర్నాటక సోప్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్  మైసూర్ శాండల్ సబ్బును నకిలీ వెర్షన్లను తయారు చేసి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను శనివారం (జనవరి 13) మలక్ పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు.వారినుంచి నకిలీ ఉత్పత్తులు, ప్యాకేజింగ్ మెటీరియల్ లతో సహా సుమారు రూ. 2 కోట్ల విలువైన మెటీరియల్ ను స్వాధీనం చేసుకున్నారు. 

150 గ్రాముల మైసూర్ శాండల్ 1800 సబ్బు ప్యాకెట్లు,9400  సబ్బులు(75 గ్రాములు) తో కూడిన 47 పెట్టెలు, తయారీ మెటీరియల్ ను సీజ్ చేశారు. నిందితులు  రాకేష్ జైన్, మహా వీర్ జైన్ లపై మలక్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. 

హైదరాబాద్ లో నకిలీ మైసూర్ శాండల్ సబ్బులు చెలామణి అవుతున్నాయని కాల్ అందుకున్న మంత్రి ఎంబీ పాటిల్ ఈ విషయాన్ని పరిశీలించాలని కేఎస్ డీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ ను ఆదేశించారు. కేఎస్ డీఎల్ బృందం మార్కెట్ లో నకిలీ సబ్బు ఉనికిని నిర్దారించిన తర్వాత నకిలీ చేస్తున్న వారిని గుర్తించేందుకు ఆపరేషన్ చేపట్టారు. పక్కా ప్రణాళికతో నకిలీ తయారీ యూనిట్ ను కనుగొన్నారు.. నిర్వాహకులను అరెస్ట్ చేశారు.