Team India Playing XI: ఐర్లాండ్తో జరిగిన సిరీస్లో ఘోర ఓటమి తర్వాత భారత జట్టు ఇప్పుడు ఇంగ్లాండ్తో తలపడేందుకు ఇంగ్లీష్ గడ్డపై అడుగు పెట్టింది. ఇరు జట్ల మధ్య ఈరోజు (జూలై 1) నుంచి జూలై 11 వరకు ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కొనసాగనుంది. ఐర్లాండ్ టూర్లో నిరాశపరిచినప్పటికీ, తొలి టీ20 కోసం భారత్ జట్టులో పెద్దగా మార్పులు చేసే ఛాన్స్ కనిపించడం లేదు. ఐపీఎల్ ఫ్లాట్ పిచ్లపై ఆడి, వెంటనే ఐర్లాండ్ కండిషన్స్కు అలవాటు పడటానికి ప్లేయర్స్ కి తగిన సమయం దొరక్కపోవడమే ఆ ఓటమికి కారణమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఇంగ్లాండ్తో జరిగే తొలి టీ20 మ్యాచ్కు బరిలోకి దిగే భారత అంచనా ప్లేయింగ్ ఎలెవన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఓపెనర్లుగా అభిషేక్, సంజు శాంసన్:
గత సిరీస్ వైఫల్యాలని పక్కన పెట్టి అభిషేక్ శర్మ, సంజు శాంసన్ జంటనే ఓపెనర్లుగా మరోసారి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఐర్లాండ్తో మొదటి మ్యాచ్లో 49 పరుగులతో అదరగొట్టిన అభిషేక్, రెండో మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. మరోవైపు సంజజు వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. అయినప్పటికీ, 2026 టీ20 వరల్డ్ కప్ ముగింపు దశలో వరుసగా 3 హాఫ్ సెంచరీలతో భారత్ను విజేతగా నిలిపిన రికార్డ్ సంజుకు ఉంది. కాబట్టి మేనేజ్మెంట్ అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వనుంది. దీంతో 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతానికి బెంచ్కే పరిమితం కాక తప్పదు.
మిడిలార్డర్:
భారత మిడిలార్డర్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని సమాచారం. థర్డ్ ప్లేస్ లో ఇషాన్ కిషన్, ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్కు రానున్నారు. ఆల్రౌండర్ల కోటాలో తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివమ్ దూబే, హర్షిత్ రాణా తమ స్థానాలను నిలబెట్టుకోనున్నారు.
బౌలింగ్ విభాగం:
బౌలింగ్ విభాగంలోనే భారత్ ఏకైక మార్పు చేసే అవకాశం కనిపిస్తుంది. టీ20 వరల్డ్ కప్ తర్వాత గాయం కారణంగా ఐర్లాండ్ సిరీస్కు దూరమైన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పూర్తిగా ఫిట్నెస్ సాధించి జట్టుతో చేరాడు. అతడు సూర్యాన్ష్ షెడ్జ్ స్థానంలో ప్లేయింగ్ XI లోకి వచ్చే అవకాశం ఉంది. పేస్ అటాక్ను అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ పంచుకోనున్నారు.
భారత ప్లేయింగ్ XI అంచనా:
అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, శివమ్ దూబే, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్
