అబిడ్స్, వెలుగు: ప్రముఖ కంపెనీల పేరిట నకిలీ ఎలక్ట్రికల్ వస్తువులను అమ్ముతున్న ఇద్దరిని ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అబిడ్స్ ట్రూప్ బజార్లోని దక్ష, విపుల్ ఎలక్ట్రికల్ షాపులపై పోలీసులు శనివారం దాడులు చేశారు. పాలిక్యాబ్, గోల్డ్ మెడల్, వి-గార్డ్ వంటి బ్రాండెడ్ కంపెనీల పేరుతో ఉన్న నకిలీ వైర్లు, స్విచ్ సాకెట్లు, ఫ్యాన్ డిమ్మర్లను గుర్తించారు. ఈ సోదాల్లో రూ. 3 లక్షల విలువైన నకిలీ సామగ్రిని సీజ్ చేసి, షాపు యజమానులు ముఖేశ్ సింగ్ పురోహిత్, ప్రవీణ్ సింగ్ను అదుపులోకి తీసుకొని సుల్తాన్ బజార్ పోలీసులకు అప్పగించారు.

