
మహబూబాబాద్, వెలుగు : జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఇద్దరు ఆడిటర్లు శుక్రవారం ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ కథనం ప్రకారం.. వరంగల్ కు చెందిన ఎండీ సలీం పాషా ..మహబూబాబాద్ సీసీఎస్లో కానిస్టేబుల్. ఇటీవల ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. జులై 31న అతడి ఇంక్రిమెంట్లకు సంబంధించిన ఫైల్ జిల్లా ఆడిట్ ఆఫీస్ కు చేరింది. సెటిల్మెంట్చేయడం కోసం సీనియర్ ఆడిటర్ జి. శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ కిశోర్ రూ. 25 వేల లంచం అడిగారు. అంత ఇచ్చుకోలేనని, రూ. 18 వేలు ఇస్తానని ఒప్పుకున్న పాషా ఈ నెల 9న ఏసీబీని సంప్రదించాడు. వారి సూచనలతో శుక్రవారం ఆడిట్ఆఫీస్లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ కిశోర్ దగ్గరకు రూ.18 వేల క్యాష్తో వెళ్లాడు. సీనియర్ ఆడిటర్ శ్రీనివాస్ తో ఫోన్ లో మాట్లాడిన కిశోర్డబ్బులు తీసుకుని లెక్కపెట్టుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. తర్వాత ఇద్దరి ఇండ్లల్లో తనిఖీలు చేశారు. నిందితులను హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఏసీబీ సీఐలు శ్యాంసుందర్, శ్రీను , తిరుపతి, శ్రీనివాస్ పాల్గొన్నారు.