కారెక్కిచ్చుకున్నా పదవి రాలే.. బీఆర్ఎస్​కు ​ ఇద్దరు నేతలు రిజైన్

కారెక్కిచ్చుకున్నా పదవి రాలే.. బీఆర్ఎస్​కు ​ ఇద్దరు నేతలు రిజైన్

సాధారణంగా సీఎం కారులో మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్తుంటారు. కానీ, మాజీలను కూడా ‘నా కారు ఎక్కండి’ అని స్వయంగా ముఖ్యమంత్రే ఆహ్వానిస్తే.. వారి ఆనందానికి హద్దే ఉండదు. అలాంటి అనుభవమే అంబర్ పేటకు చెందిన మాజీ మంత్రి కృష్ణయాదవ్, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ కు ఎదురైంది. గతేడాది గాంధీ జయంతి రోజు.. లంగర్ హౌస్ లోని బాపుఘాట్ కు సీఎం కేసీఆర్ వెళ్లారు. అదే టైమ్ లో మాజీ మంత్రి కృష్ణయాదవ్ కూడా వెళ్లారు.

 కార్యక్రమం ముగిసిన తరువాత  కృష్ణయాదవ్ ను సీఎం కేసీఆర్ పలకరించి.. ‘నాతో రా’ అని తను జర్నీ చేస్తున్న కారు ఎక్కించుకొని ప్రగతి భవన్ తీసుకెళ్లారు. దీంతో తనకు ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పోస్ట్  కన్ఫర్మ్ అని ఆయనతో పాటు తన అనుచరులూ సంతోషపడ్డారు. సీన్ కట్ చేస్తే అప్పటి నుంచి మొన్న అభ్యర్థుల ప్రకటన వరకు కృష్ణయాదవ్ కు సీఎం ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో ఇటీవల ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. త్వరలో బీజేపీ లో చేరేందుకు రెడీ అవుతున్నారు.

ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్ కు ఆరేపల్లి మోహన్

ఇటీవల బీఆర్ఎస్​ అభ్యర్థులను ప్రకటించిన రోజు.. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వంలో విప్ గా చేసిన ఆరేపల్లి మోహన్ ను సీఎం కేసీఆర్​ ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్ కు స్వయంగా తన కారులో తీసుకెళ్లారు. దీంతో తెలంగాణ భవన్ లో ఉన్న బీఆర్ఎస్ నేతలు, మంత్రులు,  మీడియా అంతా మానుకొండూరులో క్యాండిడేట్ ను మార్చుతున్నారని, ఆరేపల్లికే టికెట్ అని భావించారు. తీరా కార్యక్రమం పూర్తయ్యాక తెలంగాణ భవన్ నుంచి సీఎం ప్రగతి భవన్ కు వెళ్లే టైమ్ లో ఆరేపల్లిని అక్కడే వదిలేసి వెళ్లడం అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యానికి గురి చేసింది. 

దీంతో నిరాశ పడటం ఆరేపల్లి వంతయింది. అదేరోజు సీఎం కారులో వచ్చిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి మంత్రిపదవి దక్కగా.. ఆరేపల్లికి మాత్రం ఎలాంటి పదవి రాలేదు. దీంతో ఎమ్మెల్యే టికెట్ తోపాటు ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పదవి ఇవ్వకపోవడంతో ఆరేపల్లి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. త్వరలో సొంత గూటికి (కాంగ్రెస్) చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.