అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి డీజీపీ ఆఫీసు వద్ద పవన్ కల్యాణ్ కాన్వాయ్లోని రెండు కార్లు ఢీకొన్నాయి. కారులో ఎయిర్బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రమాదం తప్పింది. కారులో ఉన్న జనసేన నాయకులు, సెక్యూరిటీ సిబ్బందికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. జనసేన, వైసీపీ మధ్య విభేదాల రచ్చ రగులుతున్న తరుణంలో పవన్ పర్యటన ఆసక్తిని సంతరించుకుంది.
పవన్ కల్యాణ్ వర్సెస్ వైసీపీ నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలోకి సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళీ కామెంట్లు అగ్గి రాజేయడంతో వివాదం తారస్థాయికి చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చి కృష్ణా, గుంటూరు జిల్లాల పర్యటన చేస్తుండటంతో అందరి దృష్టి పవన్ చుట్టూనే కేంద్రీకృతమైంది.