మరోసారి నెత్తురోడిన బీజాపూర్ హైవే.. కేతిరెడ్డి పల్లి వద్ద ఎదురెదురుగా ఢీకొట్టుకున్న రెండు కార్లు

మరోసారి నెత్తురోడిన బీజాపూర్ హైవే.. కేతిరెడ్డి పల్లి వద్ద ఎదురెదురుగా ఢీకొట్టుకున్న రెండు కార్లు
  • ఇద్దరు మృతి, మరో ఆరుగురికి తీవ్ర గాయాలు

చేవెళ్ల, వెలుగు: హైదరాబాద్– బీజాపూర్ హైవేపై యాక్సిడెంట్లు ఆగడం లేదు. చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం మరువకముందే.. తాజాగా జరిగిన ఘటనలో మరో ఇద్దరు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. వికారాబాద్​ జిల్లా తాండూరుకు చెందిన వంశీధర్​రెడ్డి తన అత్తమ్మ సుజాత, మరో బంధువు రోజా,  డ్రైవర్​ వెంకట్​తో కలిసి శుక్రవారం ఉదయం వ్యక్తిగత పనిమీద కారులో హైదరాబాద్​ బయల్దేరాడు.

 ఇదే సమయంలో హైదరాబాద్​కు చెందిన కరీం(37), లోకేశ్​(24), బాబురావు, అఖిల్  మొయినాబాద్​ మండలం కేతిరెడ్డి పల్లి స్టేజీ సమీపంలోని గ్రీన్​ ఫీల్డ్​ రిసార్ట్స్​ లో ఫొటో షూట్​ కోసం కారులో వెళ్తున్నారు. 7:30 గంటల సమయంలో కనకమామిడి పరిధిలోని పెంటయ్య హోటల్​ వద్దకు రాగానే కరీం​కారు  రాంగ్​ రూట్​లోకి దూసుకెళ్లి వంశీధర్​ రెడ్డి కారును ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో కరీం స్పాట్​లోనే చనిపోగా.. మిగతా అందరికీ గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను మొయినాబాద్​ మున్సిపల్​ పరిధిలోని భాస్కర్ ఆస్పత్రికి తరలించారు. లోకేశ్​ ఇక్కడే చికిత్స పొందుతూ చనిపోయాడు. వంశీధర్​ రెడ్డి డ్రైవర్ ​వెంకట్​, బంధువుల్లో ఒకరికి సీరియస్​గా ఉండడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వంశీధర్​ రెడ్డి ఫిర్యాదుతో  కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పవన్​ కుమార్​ రెడ్డి తెలిపారు. 

మరో ఘటనలో కారును ఢీకొన్న బస్సు..

బీజాపూర్​ హైవేపైనే ఇంకో యాక్సిడెంట్ జరిగింది. వికారాబాద్​ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్​ నుంచి వికారాబాద్​ వెళ్తోంది. దామరిగిద్ద గేటు సమీపంలోకి రాగానే డ్రైవర్​ ముందు వెళ్తున్న కారును ఓవర్​ టేక్ చేయబోయాడు. ఈ క్రమంలో అదుపు తప్పి కారును ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.