- ఇద్దరు మృతి, మరో ఆరుగురికి తీవ్ర గాయాలు
చేవెళ్ల, వెలుగు: హైదరాబాద్– బీజాపూర్ హైవేపై యాక్సిడెంట్లు ఆగడం లేదు. చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం మరువకముందే.. తాజాగా జరిగిన ఘటనలో మరో ఇద్దరు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన వంశీధర్రెడ్డి తన అత్తమ్మ సుజాత, మరో బంధువు రోజా, డ్రైవర్ వెంకట్తో కలిసి శుక్రవారం ఉదయం వ్యక్తిగత పనిమీద కారులో హైదరాబాద్ బయల్దేరాడు.
ఇదే సమయంలో హైదరాబాద్కు చెందిన కరీం(37), లోకేశ్(24), బాబురావు, అఖిల్ మొయినాబాద్ మండలం కేతిరెడ్డి పల్లి స్టేజీ సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ రిసార్ట్స్ లో ఫొటో షూట్ కోసం కారులో వెళ్తున్నారు. 7:30 గంటల సమయంలో కనకమామిడి పరిధిలోని పెంటయ్య హోటల్ వద్దకు రాగానే కరీంకారు రాంగ్ రూట్లోకి దూసుకెళ్లి వంశీధర్ రెడ్డి కారును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కరీం స్పాట్లోనే చనిపోగా.. మిగతా అందరికీ గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని భాస్కర్ ఆస్పత్రికి తరలించారు. లోకేశ్ ఇక్కడే చికిత్స పొందుతూ చనిపోయాడు. వంశీధర్ రెడ్డి డ్రైవర్ వెంకట్, బంధువుల్లో ఒకరికి సీరియస్గా ఉండడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వంశీధర్ రెడ్డి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పవన్ కుమార్ రెడ్డి తెలిపారు.
మరో ఘటనలో కారును ఢీకొన్న బస్సు..
బీజాపూర్ హైవేపైనే ఇంకో యాక్సిడెంట్ జరిగింది. వికారాబాద్ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళ్తోంది. దామరిగిద్ద గేటు సమీపంలోకి రాగానే డ్రైవర్ ముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేయబోయాడు. ఈ క్రమంలో అదుపు తప్పి కారును ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
