డీఆర్ఎఫ్​ సభ్యులను అన్యాయంగా చంపేశారంటూ ఆగ్రహం

డీఆర్ఎఫ్​ సభ్యులను అన్యాయంగా చంపేశారంటూ ఆగ్రహం

నేలకొండపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి గ్రామంలో చెక్​డ్యాం దగ్గర గురువారం గల్లంతైన ఇద్దరూ మృతిచెందారు. శుక్రవారం వారి డెడ్​బాడీలను వెలికితీశారు. చెన్నారం గ్రామానికి చెందిన రంజిత్(24) గురువారం చేపలు పట్టేందుకు వెళ్లి చెక్​డ్యాం దగ్గర వరద ప్రవాహంలో గల్లంతయ్యాడు. అతడిని వెతికేందుకు వచ్చిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(డీఆర్ఎఫ్)​ టీమ్​కు చెందిన వెంకటేశ్(32) చనిపోగా ప్రవీణ్(35) గల్లంతయ్యాడు.

శుక్రవారం ఉదయం రంజిత్ మృతదేహం చెక్​డ్యామ్​కు రెండు కిలోమీటర్ల దూరంలో రామచంద్రాపురం గ్రామం వద్ద దొరికింది. శవాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కొద్దిగంటల తర్వాత ప్రవీణ్ మృతదేహం చెక్ డ్యాం వద్ద పైకి తేలింది. గమనించిన బంధువులు డెడ్​బాడీని బయటకు లాగారు. ప్రవీణ్ బంధువులు తెల్లవారుజాము నుంచి ఘటనా స్థలంలో ఉన్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గల్లంతయిన వారిని గాలించే పనులు సైతం చేపట్టకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. వెంకటేశ్, ప్రవీణ్ మృతికి  బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు వారికి నచ్చజెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం తరలించారు. 

అన్యాయంగా నా కొడుకుని చంపారు

నీళ్లలో దిగి గాలించడం డీఆర్ఎఫ్​ సభ్యుల పని కాదు. కానీ వాళ్లను అన్యాయంగా నీళ్లలో దింపి చంపేశారు. గల్లంతయిన వారిని గాలించడానికి ఏ ఒక్క అధికారి కూడా రాలేదు. మేం ఫోన్​చేసినా స్పందించలేదు. గాలింపు చర్యలు చేపట్టకుండా, సమాచారం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. చివరికి ప్రవీణ్ బాడీని మేమే దేవులాడుకోవాల్సి వచ్చింది. ఇందుకు కారణమైన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలి. మాకు న్యాయం చేయాలి. 

- రమాదేవి, ప్రవీణ్ తల్లి