పుల్వామాలో ఎయిర్ ఫోర్స్ వాహనానికి ప్రమాదం : ఇద్దరు అధికారులు మృతి

పుల్వామాలో ఎయిర్ ఫోర్స్ వాహనానికి ప్రమాదం : ఇద్దరు అధికారులు మృతి

జమ్ముకశ్మీర్ : దక్షిణ పుల్వామాలో IAF అధికారులు ప్రయాణిస్తున్న వాహనానికి యాక్సిడెంట్ అయింది. ఈ ఘటనలో ఇద్దరు ఎయిర్ ఫోర్స్ అధికారులు చనిపోయారు. గురువారం ఉదయం 3నుంచి 4 గంటల మధ్యలో నలుగురు IAF అధికారులు స్కార్ఫియో వాహనంలో ప్రయాణిస్తున్నారు.  పుల్వామాలోని అవంతిపుర ఎయిర్ బేస్ క్యాంపు వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. సమాచారం అందిన వెంటనే జమ్ము పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆర్మీ లోకల్ బేస్ హాస్పిటల్ లో చేర్చారు. చికిత్స పొందుతూ ఇద్దరు ఎయిర్ ఫొర్స్ అధికారులు మరణించగా… మరో ఇద్దరు కోలుకుంటున్నారు.

మరణించిన వారిలో.. స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ పాండే, కార్పల్ అజయ్ కుమార్ ఉన్నారు. గాయపడిన వారిలో ఓ ఎయిర్ ఫోర్స్ అధికారి, ఎయిర్ మెన్ ఉన్నట్లు IAF తెలిపింది.

ప్రమాదంలో మరణించిన ఎయిర్ ఫోర్స్ అధికారుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్ధుల్లా. గాయపడిన మరో ఇద్దరు  తొందరగా కోలుకోవాలని ఆశించారు.