- పశ్చిమబెంగాల్లోని కల్కత్తాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
బెంగళూరు : కర్నాటక బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. వీరిని పశ్చిమబెంగాల్లోని కల్కత్తాలో అరెస్ట్ చేశామని శుక్రవారం తెలిపింది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, కర్నాటక, బెంగాల్, తెలంగాణ, కేరళ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. నిందితులను ముస్సావీర్ హుస్సేన్ షాజెబ్, అబ్దుల్ మతీన్ తాహాలుగా గుర్తించారు. ముస్సావీర్ కేఫ్లో బాంబును అమర్చగా, అందుకు ప్లాన్ తాహా ఇచ్చినట్లు గుర్తించారు. పేలుడు జరిగిన తర్వాత వీరిద్దరు బెంగళూరు నుంచి పశ్చిమబెంగాల్కు పారిపోయారు.
అక్కడ పేర్లు మార్చుకొని నివసిస్తున్నారు. కాగా, నిందితుల్లో ఒకరు ధరించిన క్యాప్ వారిని పట్టించింది. బాంబు అమర్చే ముందు నిందితుడు ఓ షాప్లో కొన్న క్యాప్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అక్కడి పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, వారు కల్కత్తాకు పారిపోయినట్లు గుర్తించారు. వెంటనే అక్కడి పోలీ సులను అలర్ట్ చేసిన ఎన్ఐఏ.. నిం దితులను అరెస్ట్ చేశారు. వీరిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కర్నాటక శివమొగ్గ జిల్లాలోని తీర్థహాళ్లికి చెందిన వారుగా గుర్తించారు. ఇప్పటివరకు ఈ కేసులో నలుగురిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.