పెట్స్​ కు ఉందో .. మహాప్రస్థానం

పెట్స్​ కు ఉందో .. మహాప్రస్థానం
  •    పెట్స్​ కు ఉందో .. మహాప్రస్థానం
  •    గ్రేటర్ సిటీలో కొత్తగా రెండు క్రిమిటోరియాలు  
  •      శేరిలింగంపల్లి, కూకట్ పల్లి జోన్ల  పరిధిలో అందుబాటులోకి
  •     ఈ నెలాఖరున లేదా వచ్చే నెలలో ఓపెన్  
  •     కాల్ చేసి చెబితే చాలు గంటల్లో వస్తారు
  •     ప్రత్యేక వెహికల్ లో తీసుకుని వెళ్తారు
  •     ఇప్పటికే ఫతుల్లాగూడలో బల్దియా నిర్వహణ

హైదరాబాద్, వెలుగు:  గ్రేటర్ సిటీలో  ఎవరి ఇంట్లోనైనా పెట్ చనిపోతే.. అంత్యక్రియలు చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. రోడ్డు పక్కనో.. నాలాలోనో.. శివారు ప్రాంతానికో తీసుకెళ్లి పారేయడం చేస్తుంటారు. ఇకముందు అలాంటి ఇబ్బంది లేకుండా బల్దియా పెట్ క్రిమిటోరియాలను నిర్మిస్తోంది. ఇప్పటికే ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి బల్దియా నాగోల్ పరిధి ఫతుల్లాగూడలో శ్మశాన వాటికను ఏర్పాటు చేసింది. కొత్తగా మరో రెండు శేరిలింగంపల్లి జోన్ తెల్లాపూర్ పరిధి గోపన్ పల్లిలో ఎన్టీవోతో ఒకటి, కూకట్ పల్లి జోన్ ఎల్లమ్మబండలో బల్దియా సొంత నిధులతో మరొకటి నిర్మిస్తోంది.

గోపన్ పల్లిలో రూ.1.80 కోట్లు, ఎల్లమ్మబండలో రూ. కోటి ఖర్చు చేస్తోంది. వీటి పనులు దాదాపు పూర్తి అయ్యాయి. ఈ నెలాఖరు లేదా వచ్చేనెలలో ప్రారంభించనుంది. సెంట్రల్‌‌‌‌ పొల్యూషన్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ బోర్డు (సీపీసీబీ) గైడ్ లైన్స్ మేరకు నిర్మిస్తోంది. వీటిలో సుమారు 45 నుంచి 60 నిమిషాల్లోనే జంతు కళేబరాలు బూడిద అవుతాయి. బయటకు కొంచెం కూడా పొగ రాదు. గోపన్ పల్లిలో నిర్మించేది మహాప్రస్థానం తరహాలో ఉంది. ఇలా మనుషులకే కాదు.. జంతువులకు కూడా చివరిక్షణాల్లో మర్యాద పూర్వకంగా క్రిమియేషన్ జరగాలనే లక్ష్యంతో నిర్మించామని ‘ రాగా’ ఎన్జీవో  ఫౌండర్ నందకిషోర్ తెలిపారు. 

 సంప్రదాయంగా వీడ్కోలు 

పెంపుడు జంతువులంటే కొందరికి ప్రాణం. వాటిని తమ కుటుంబసభ్యులుగా చూసుకుంటారు. వాటికి చిన్న జ్వరం వచ్చినా ఆందోళనకు గురవుతుంటారు. అయితే.. పెట్ ల జీవితకాలం మనుషులకంటే తక్కువగా ఉంటుంది. బతికి ఉన్నప్పుడు ఎంతో ప్రేమగా చూసినా.. చనిపోయిన తర్వాత వాటికి ఎక్కడ అంత్యక్రియలు చేయాలో మాత్రం తెలియదు. పెట్ ల అంత్యక్రియలకు చాలా ఇబ్బంది మారింది. ఇలాంటి సమస్యను గుర్తించిన కొన్ని ఎన్జీవోలు సంప్రదాయబద్ధంగా వీడ్కోలు పలికేందుకు నిర్ణయించారు. ప్రత్యేకంగా శ్మశాన వాటికలను అందుబాటులోకి తెచ్చారు. బల్దియాతో కలిసి పెట్ క్రిమిటోరియాలను నిర్మిస్తున్నారు.  

ఫోన్ కాల్ చేసి చెబితే చాలు.. 

సిటీలో ఎవరి ఇంట్లోనైనా పెట్ ( పెంపుడు జంతువు) చనిపోయిందని సమాచారం ఇస్తే చాలు.  అక్కడికి వెంటనే వెళ్లి అంత్యక్రియలకు తీసుకెళ్తారు. ఇందుకు ప్రత్యేకంగా ఓ వెహికల్ కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఫ్రీజర్ కూడా ఉంటుంది. ఫోన్ కాల్ చేసిన గంట, రెండు గంటల్లోనే శ్మశానవాటికకు తరలిస్తారు. ఇందుకు జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నంబర్ 040 –21111111 తో పాటు ఎన్జీవో సంస్థ  వెబ్ సైట్ PAW MEMORIES ( త్వరలో అందుబాటులోకి రానుంది) ద్వారా కూడా సమాచారం ఇవ్వొచ్చు. చనిపోయిన పెట్ ను దహనం చేసిన అనంతరం హస్తికలు, బూడిదను తీసుకెళ్లి సంబంధిత ఇంటి ఓనర్ కు అందజేస్తారు. మొత్తంగా మనుషులు మరణిస్తే ఏ విధంగానైతే తుది వీడ్కోలు పలుకుతారో.. పెట్ లకు కూడా అదేవిధంగా నిర్వహిస్తారు.